సాక్షి,నంద్యాల: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల అరాచకాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో దేవస్థానానికి సంబంధించిన తలనీలాల టెండర్ల ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే అఖిలప్రియ ముఖ్య అనుచరులు కొందరు టెండర్ దారులను బహిరంగంగానే బెదిరింపులకు గురిచేయడం నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రాణం మీద ఆశ ఉంటే వెనక్కి పోండి
అహోబిలం పుణ్యక్షేత్రంలో తలనీలాల సేకరించే హక్కుల కోసం దొరై కంపెనీ యజమాని నిబంధనల ప్రకారం టెండర్ దాఖలు చేశారు. అయితే, ఈ టెండర్ తమ వర్గానికి కాకుండా ఇతరులకు ఎలా దక్కుతుందంటూ ఎమ్మెల్యే అనుచరులు సదరు కాంట్రాక్టర్పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ‘నీకు ప్రాణం మీద ఆశ ఉంటే వెంటనే అహోబిలం తలనీలాల టెండర్ను రద్దు చేసుకోవాలి..లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అంటూ ఫోన్ చేసి బెదిరించాడు.

కాంట్రాక్టర్ను బెదిరిస్తూ భూమా అఖిలప్రియ ప్రధాన అనుచరులు మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రాణ భయంతో ఉన్న కాంట్రాక్టర్ ఈ ఆడియోను బయటపెట్టడంతో ఎమ్మెల్యే వర్గీయుల సెటిల్మెంట్లు, బెదిరింపుల వ్యవహారం బహిర్గతమైంది. అధికార బలంతో స్థానిక వ్యాపారులను, టెండర్ దారులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఆళ్లగడ్డ మండలాన్ని అరాచకాలకు అడ్డాగా మారుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.


