సాక్షి, కర్నూలు: ఏపీలో కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సుగాలి ప్రీతి కేసు, కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తే రావణ్పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.
సుగాలి ప్రీతి తల్లి సుగాలీ పార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్ల అవుతున్నా సుగాలి ప్రీతి కేసు విషయంలో నిందితుల పట్ల అరెస్టు, విచారణ చేయడం లేదు. ముద్దాయిలు విచ్చలవిడిగా తిరుగుతున్నా.. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రీతి కేసులో రెండు సంవత్సరాలుగా డిప్యూటీ సీఎం పవన్కు లేఖలు రాస్తున్నాం. కానీ ఎటువంటి సమాధానం లేదు. ఈ కేసు విషయమై డిప్యూటీ సీఎం పవన్ను ప్రశ్నించిన రావణ్పై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు.
త్వరలో సుగాలి ప్రీతికి న్యాయం కోసం పవన్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి పోరాటం చేస్తాం.. ప్రశ్నిస్తాం. రావణ్పై అక్రమ కేసులు పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ ఎందుకు చూపించడం లేదు. ఎందుకు చొరవ తీసుకోవడం లేదు. అక్రమ అరెస్ట్, నిర్బంధంపై రావణ్కు మేము అండగా ఉంటాం. రావణ్కు ఎటువంటి హాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.


