శ్రీశైలం డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలి | Srisailam Dam needs immediate repairs | Sakshi
Sakshi News home page

శ్రీశైలం డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలి

Apr 30 2025 5:15 AM | Updated on Apr 30 2025 5:15 AM

Srisailam Dam needs immediate repairs

నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌ అనిల్‌జైన్‌ 

శ్రీశైలం ప్రాజెక్ట్‌: శ్రీశైలం డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టకపోతే రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) చైర్మన్‌ అనిల్‌జైన్‌ చెప్పారు. శ్రీశైలం డ్యామ్‌ పటిష్టతను అంచనా వేసేందుకు మంగళవారం అనిల్‌జైన్‌తోపాటు నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అప్రోచ్‌ రోడ్, ప్లంజ్‌పూల్, గ్యాలరీ, బ్లాకులు, రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను నిపుణులు పరిశీలించి వివిధ సమస్యలను గుర్తించారు. 2009వ సంవత్సరానికి ముందు ప్లంజ్‌పూల్‌ ప్రాంతంలో గోతులు ఏర్పడ్డాయి. 

అయితే, 2009 వరదల వల్ల ఒక్క రోజులోనే 25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో ప్లంజ్‌పూల్‌ ప్రాంతంలో 120 మీటర్ల నుంచి 150 మీటర్ల లోతు గొయ్యిలు ఏర్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. దీనివల్ల డ్యామ్‌ పునాదులు కూడా బలహీనపడినట్లు తేల్చారు. స్పిల్‌వే ఎగువన కటాఫ్‌ దెబ్బతినడంతో 17, 18 బ్లాక్‌లలో పగుళ్లు ఏర్పడ్డాయని, పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. సీజన్‌తో సంబంధం లేకుండా గ్యాలరీలో సీపేజీలు అధికమయ్యాయని, ఇవి డ్యామ్‌ అంతర్గత నిర్మాణాన్ని శిథిలం చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. 

శ్రీశైలం డ్యామ్‌ పటిష్టతకు తక్షణమే చర్యలు తీసుకోకపోతే జలాశయం మనుగడ మరింత ప్రమాదకరంగా మారుతుందని స్పష్టంచేశారు. అనంతరం డ్యామ్‌ ఇంజనీర్లతో అనిల్‌జైన్, నిపుణులు సమావేశమై మొదటి విడతలో అప్రోచ్‌ రోడ్‌ నిర్మాణం, ప్లంజ్‌పూల్‌ గోతుల పూడ్చివేత, రెండో విడతలో బ్లాకుల పటిష్టత, గ్యాలరీ సీపేజీల అరెస్ట్‌కు చేపట్టాల్సిన మరమ్మతులపై చర్చించారు. 

పరిశీలనలు, సమీక్షలతోనే సంవత్సరాలుగా కాలయాపన చేయడం, శ్రీశైలం డ్యామ్‌ మరమ్మతులకు ప్రపంచ బ్యాంక్‌ రూ.200కోట్లు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చినా వినియోగించుకోకపోవడంపై నిపుణులు విస్మయం వ్యక్తంచేశారు. ఎన్‌డీఎస్‌ఏ రీజనల్‌ డైరెక్టర్‌ ఎన్‌డీ గిరిధర్, డ్రిప్‌ ప్రాజెక్ట్‌ ప్రతినిధి నీతా, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రభాత్‌కుమార్, సీఈ రాజేష్‌ కశ్యప్, ఈఎన్‌సీ రత్నకుమార్, డ్యామ్‌ సీఈ కబీర్‌బాషా, ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి డ్యామ్‌ తనిఖీల్లో పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement