శ్రీశైలంటెంపుల్: రాష్ట్రంలో వర్షాలు లేక అనావృష్టి సంభవిస్తున్న తరుణంలో ఎట్టకేలకు దేవదాయశాఖ ఆలస్యంగా స్పందించింది. తెలుగు సంవత్సరం ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ప్రచాంగ శ్రవణం రోజున రాబోవు సంవత్సర కాలంలో వర్షాభావ పరిస్థితులను పంచాంగ శ్రవణకర్త వివరిస్తారు. తదనుగుణంగా ఈ ఏడాది దేవస్థానంలో వైదిక కమిటీతో చర్చించి సహస్ర ఘట్టాభిషకం నిర్వహించాల్సి ఉంది. అయితే శ్రీశైల దేవస్థానం ఆ దిశగా ఆలోచన చేయలేదని తెలుస్తోంది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితి దృష్ట్యా అనావృష్టి ఏర్పడింది. పంటలు సాగుకు నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వరుణయాగ సహస్ర ఘట్టాభిషేకానికి శ్రీశైల దేవస్థానం నిర్ణయం తీసుకుంది. దేవస్థానం ఆధ్వర్యంలో ఆగస్టు 7నుంచి 11వరకు పాంచాహ్నిక వరుణయాగ సహిత సహస్ర ఘట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఈఓ శ్రీనివాస రావు తెలిపారు. లోకకల్యాణార్థం రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సహస్ర ఘట్టాభిషేకం నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వాస్తవానికి పంచాంగ శ్రవణంలో తెలిపినట్లు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జూన్ నెలలోనే దేవస్థాన అధికారులు ముందస్తుగానే వైదిక కమిటీతో చర్చించి సహస్ర ఘట్టాభి షేకం నిర్వహించి ఉంటే బాగుండునని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2023 సంవత్సరంలో జూన్ 29న శ్రీశైల దేవస్థానంలో సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించారు. అటు తరువాత మూడేళ్ల అనంతరం ప్రస్తుతం దేవస్థానంలో సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించాలని నిర్ణయించారు. కొంచెం ఆలస్యంగా శ్రీశైల దేవస్థానంలో వరుణయాగ సహిత సహస్ర ఘట్టాభిషేకం నిర్వహిస్తున్నారు.
శ్రీశైల దేవస్థానంలో ప్రతి సంవత్సరం జేష్ట మాసంలో ఆరుద్ర నక్షత్రం లేక మాస శివరాత్రి రోజుల్లో శ్రీశైల జగద్గురుల ఆధ్వర్యంలో లోకకల్యాణార్థం వర్షాలు విరివిగా కురవడం కోసం మల్లికార్జున స్వామివారికి సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించాలి. అదే రోజు రాష్ట్రంలోని అన్ని శివాలయాల్లో కూడా భక్తులచే సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించాలి. శ్రీశైల దేవస్థానంలో కుంభోత్సవం, శాకాంబరీ ఉత్సవాలను విధిగా నిర్వహిస్తున్న దేవస్థానం ఎంతో విశిష్టత కలిగిన సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించకపోవడం శోచనీయం. – జేపీ మల్లికార్జునయ్య, అధ్యక్షులు, వీరశైవ జంగమ మహేశ్వర సంక్షేమ సంఘం
ఈ ఏడాది రాష్ట్రంలో
వర్షాభావ పరిస్థితులు
వరుణయాగ సహస్ర ఘట్టాభిషేకానికి
శ్రీశైల దేవస్థానం నిర్ణయం
ఆగస్టు 7 నుంచి చేపట్టేందుకు
అధికారుల ఏర్పాట్లు


