● ఎస్సీ బాలికల వసతి గృహంలో
కుక్ నిర్వాకం
సాక్షి, టాస్క్ఫోర్స్: కోవెలకుంట్ల పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులు వంట మనుషులుగా మారారు. వివిధ ప్రాంతాలకు చెందిన 60 మంది విద్యార్థినులు పట్టణంలోని వివిధ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసిస్తూ హాస్టల్లో ఉంటున్నారు. వార్డన్తో పాటు వంటమనిషి, కమాటీ, వాచ్మెన్ విధులు నిర్వర్తిస్తున్నారు. వంటమనిషి కొన్ని రోజుల నుంచి హాస్టల్ విద్యార్థినులతో వంట పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కూరగాయలు తరగడం, పూరి, చపాతి పిండి కలిపి వాటిని తయారు చేయడం, తదితర పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. హాస్టల్లో వంటమనిషి, వాచ్మెన్కు మనస్పర్ధలు ఉండటంతో వారి సమస్యలను విద్యార్థినులపై రుద్ది కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. హాస్టల్లో జరుగుతున్న విషయాలను కొందరు విద్యార్థి సంఘాల నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. హాస్టల్లో జరుగుతున్న పరిణామాలను విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


