కాపు యువకుడు సాయికృష్ణ లాకప్డెత్ కేసు
ఉపసంహరణకు ఓ పచ్చనేత యత్నాలు
నేడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసులో సిట్ విచారణ తూతూ మంత్రంగా సాగుతోంది. అసలు సూత్రధారులు, పాత్రధారులను రక్షించే విధంగా దర్యాప్తు పక్కదారి పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్కు సంబంధించి కీలకమైన ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది.
ఈ తరుణంలో ప్రభుత్వ పెద్దలు తెరవెనుక పొలిటికల్ డ్రామాకు తెర తీశారు. బాధిత కుటుంబ సభ్యుల ద్వారా కేసు ఉపసంహరణకు ఓ పచ్చనేత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఈ కేసులో సూత్రధారులు వెలుగులోకి రావడం ఖాయమనే ఆందోళనతో తెర వెనుక కుట్రలకు పదును పెట్టారు.


