
సాక్షి, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్–2, గ్రూప్–1, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్న ఏపీపీఎస్సీ.. తాజాగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 11 సబ్జెక్టుల్లో 240 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా పోస్టులు, విద్యార్హతలు, వేతనం, పరీక్ష విధానం తదితర వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో జనవరి 24 నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్–1) 150 మార్కులకు డిగ్రీ స్థాయిలో ఉంటుంది. పేపర్–2 సంబంధిత సబ్జెక్టు పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో 150 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి మైనస్ మార్కులు ఉంటాయని కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షల సబ్జెక్టు సిలబస్ https://psc.ap.gov.inలో చూడవచ్చు.