Fact Check: రాష్ట్ర ప్రగతికి ‘రామోజీ’ పొగ | Ramoji Poisonous campaign to prevent IT companies from coming | Sakshi
Sakshi News home page

Fact Check: రాష్ట్ర ప్రగతికి ‘రామోజీ’ పొగ

Feb 4 2024 5:41 AM | Updated on Feb 4 2024 5:47 AM

Ramoji Poisonous campaign to prevent IT companies from coming - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రగతికి రామోజీ పొగ పెడుతున్నారు. ఐటీ రంగంలో రాష్ట్రం అభివృద్ధి చెందకుండా విష ప్రచారంతో అడ్డుకుంటున్నారు. గత నాలుగు నెలలుగా ఈనాడులో నెలకో అసత్య కథనంతో ప్రగతికి ప్రతిబంధకంగా మారారు. శనివారమూ ఇలాగే ఓ విష కథనం ప్రచురించి యువతను, ఐటీ సంస్థలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం ఏమాత్రం అభివృద్ధి చెందకపోయినా ఒక్క ముక్కా రాయని రామోజీ.. ఇప్పుడు అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వచ్చినా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు.

చంద్రబాబు హయాంలో హెచ్‌సీఎల్‌ తప్ప (అది కూడా 2020 మార్చిలో ప్రారంభమైంది) తప్ప పేరున్న ఒక్క ఐటీ సంస్థా రాలేదు. కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభించింది. విప్రో కూడా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభిస్తోంది. అమెజాన్, బీఈఎల్, రాండ్‌ శాండ్, టెక్నోటాస్క్, ఐజెన్‌ అమెరికా సాఫ్ట్‌వేర్, టెక్‌బుల్, కాంప్లెక్స్‌ సిస్టమ్స్‌ వంటి అనేక సంస్థలు వచ్చాయి. 

అదో పెద్ద కుంభకోణం 
డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్క్స్‌ పథకాన్ని రద్దు చేశారంటూ ఈనాడు గోల పెట్టింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఓ పెద్ద కుంభకోణం. ఎటువంటి కంపెనీలూ రాకపోయినా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద నిర్మించిన భవనాల్లో కంపెనీలు రాకపోతే 70 శాతం అద్దెను, అది కూడా బిల్డర్‌ ఎంత నిర్ణయిస్తే అంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. అందుకే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. 

మూడు రెట్లు పెరిగిన అంకురాలు 
అంకుర సంస్థలు మూడు రెట్లు పెరిగాయని శుక్రవారమే రాజ్య సభలో కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి చెప్పినప్పటికీ.., కళ్లకు, చెవులకు గంతలు కట్టుకున్న రామోజీ రాష్ట్ర యువత మెదళ్లలోకి విషం ఎక్కించే ప్రయత్నం చేశారు. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు ఉండగా ఇప్పుడు 586కు చేరాయి. వీటిలో ఉద్యోగుల సంఖ్య 1,552 నుంచి 55,669కు పెరిగింది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగో పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీని కల్పతరవు పేరిట విశాఖలో ఏర్పాటు చేశారు. అక్కడ పెద్ద ఎత్తున స్టార్టప్‌లు వస్తున్నాయి.

అలాగే నాస్కామ్‌ సహాయంతో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ ఏర్పాటు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్‌ జోన్‌లోనూ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి హెస్‌ఎస్‌బీసీ వెళ్లిపోయిందంటూ ఈనాడు వాపోయింది. వాస్తవంగా చైనాకు చెందిన ఆ సంస్థ విశాఖే కాదు.. దేశంలోని అన్ని కార్యాలయాలను మూసివేసింది.

ఆ భవనంలో డబ్ల్యూఎన్‌ఎస్‌ కార్యాలయం నడుస్తోంది. ఐబీఎం వెళ్లిపోయిందంటూ ఈనాడు మరో అబద్ధం అచ్చేసింది. వాస్తవానికి ఐబీఎం అనుబంధ సంస్థ ఐబీఎం దక్ష  2007లో విశాఖలో ఏర్పాటైంది. ఆ తర్వాత ఐబీఎం దానిని కన్సంట్రిక్స్‌ అనే సంస్థకు విక్రయించింది. కన్సంట్రిక్స్‌ విశాఖ వెలుపల కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఇప్పుడు ఆ బిల్డింగ్‌లో ఇన్ఫినిటీ అనే సంస్థ పనిచేస్తోంది. 

65 కంపెనీలు 47,908 మందికి ఉద్యోగాలు 
గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ఐటీ రంగంలో కొత్తగా 65 కంపెనీలు ఏర్పాటైనట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వీటి ద్వారా కొత్తగా 47,908 మందికి ఉద్యోగాలొచ్చాయి. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 27,643 కాగా, ఇప్పుడు 75,551 మందికి పెరిగింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ సహకారంతో దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రావడంతోపాటు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు విస్తరణ చేపట్టాయి. విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన టెక్‌ మహీంద్రా విజయవాడకు విస్తరించింది. హెచ్‌సీఎల్‌ విజయవాడ నుంచి తిరుపతికి విస్తరించింది.

విశాఖలో ఉన్న డబ్ల్యూఎన్‌ఎస్, పల్సస్‌ ఐడీఏ వంటి 30కి పైగా ఐటీ కంపెనీలు విస్తరణ చేపట్టాయి. 2012లో 50 మందితో ప్రారంభమైన డబ్ల్యూఎన్‌ఎస్‌ గ్లోబల్‌ సరీ్వసెస్‌ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 3,300 దాటింది. వీరిలో 2,000 మంది ఉద్యోగులు గత రెండేళ్లలోనే చేరినట్లు ఆ సంస్థ సీఈవో కేశవ్‌ ఆర్‌ మురుగేష్‌ స్వయంగా ప్రకటించారు. 2019లో 40 మందితో ప్రారంభించిన తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 4,200 దాటినట్లు పల్సస్‌ సీఈవో గేదెల శ్రీనుబాబు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగం ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కాన్సెప్ట్‌ సిటీలు ఏర్పాటు చేస్తోంది.

ప్రైవేటు రంగంలో ఐటీ పార్కులనూ ప్రోత్సహిస్తోంది. రూ.21,844 కోట్లతో అదానీ డేటా సెంటర్, భారీ ఐటీ టవర్‌ను ఏర్పాటు చేస్తోంది. రహేజా గ్రూపు ఇనార్బిట్‌ మాల్‌తో పాటు ఐటీ టవర్‌ నిరి్మస్తోంది. ఏపీఐసీసీ రూ.2,300 కోట్లతో మధురవాడలో 19 ఎకరాల్లో ‘ఐ స్పేస్‌’ పేరుతో ఐటీ టవర్‌ నిరి్మస్తోంది. విశాఖలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో ఐటీ రంగానికి సంబంధించి 65 ఎంవోయూలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా రూ. 28,867 కోట్ల పెట్టుబడులతో పాటు 1.14,255 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 

నిక్సీ వస్తే వెలుగులే 
విశాఖ కేంద్రంగా నేషనల్‌ ఇంటర్నెట్‌ ఎక్స్చేంజి ఆఫ్‌ ఇండియా (నిక్సీ) ద్వారా ఇంటర్నెట్‌ ఎక్స్చేంజి కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇటీవలే నిక్సీ బృందం విశాఖను సందర్శించింది. విశాఖలో ఈ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించేందుకు అన్ని అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయని నిర్ధారించింది. ఇంటర్నెట్‌ ఎక్స్చేంజ్‌ ఏర్పాటైతే ఇతర రాష్ట్రాల నుంచి డేటా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలు అందుతాయి. తద్వారా అనేక కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement