
ఏడాది కూటమి పాలనలో ప్రభుత్వ విద్య నిర్వీర్యం
వ్యవస్థ అస్తవ్యస్తం.. దిగజారిన సర్కారు బడుల ప్రగతి
పాఠశాలల్లో అటకెక్కిన నాడు–నేడు అభివృద్ధి పనులు
అమ్మ ఒడికి వీడ్కోలు.. ఇంగ్లిష్ మీడియానికి మంగళం
డిజిటల్ క్లాస్రూమ్కు బైబై.. టోఫెల్ క్లాసులకు టాటా
సీబీఎస్ఈ, ఐబీ బోధన ఎత్తివేత.. సబ్జెక్ట్ టీచర్లపై వేటు
ఘోరంగా మారిన గోరుముద్ద.. దారుణంగా పడిపోయిన ఫలితాలు
దీంతో ప్రభుత్వ బడులను వీడి విద్యార్థుల ప్రైవేటు బాట
ప్రైవేటు యాజమాన్యాలకు మేలుచేసేలా కూటమి నిర్ణయాలు
కార్పొరేట్ స్కూళ్లలో 10 నుంచి 30 శాతం పెరిగిన ఫీజులు
దీనికి పుస్తకాలు, యూనిఫాం ఖర్చులు అదనం
రాష్ట్రంలో 13 వేల ప్రైవేటు స్కూళ్లలో ఇదే పరిస్థితి
పిల్లల చదువులపై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన
రాష్ట్రంలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
విజయనగరంలోని నారాయణ స్కూల్లో గత ఏడాది 3వ తరగతికి స్కూల్ ఫీజు రూ.48 వేలు, పుస్తకాలకు రూ.7,500, రిజర్వ్ నగదు రూ.1,000 (మొత్తం రూ.56,500) వసూలు చేశారు. ఈ ఏడాది స్కూల్ ఫీజును రూ.55 వేలు చేశారు. పుస్తకాలకు రూ.8,500 కట్టించుకున్నారు. రిజర్వ్ నగదు రూ.వెయ్యితో కలిపి రూ.64,500 వసూలు చేస్తున్నారు. ఇదే స్కూల్లో నిరుడు 4వ తరగతికి స్కూల్ ఫీజు రూ.50 వేలు, పుస్తకాలకు రూ.8,500,(రిజర్వ్ నగదు రూ.1,500) మొత్తం రూ.60 వేలు తీసుకున్నారు. నేడు స్కూల్ ఫీజును రూ.60 వేలకు పెంచారు. పుస్తకాలకు రూ.9,500 తీసుకున్నారు.
ఏడాదిలోనే ఎంత తేడా...? అప్పుడు అంతా ప్రగతి బాట.. ఇప్పుడు మొత్తం అస్తవ్యస్తం..! నాడు సంస్కరణల పథం.. నేడు నిర్వీర్యం..! వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక విప్లవంలా విద్యారంగాన్ని ముందుకుతీసుకెళ్లగా... టీడీపీ కూటమి సర్కారు అంతా కుప్పకూల్చింది..! పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తపించగా.. ప్రైవేటుమయం చేయాలని ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీంతో నాడు–నేడు అభివృద్ధి పనులు అటకెక్కాయి.. సర్కారీ చదువులు చట్టుబండలవుతున్నాయి..! అమ్మ ఒడికి వీడ్కోలు పలికారు...ఇంగ్లిష్ మీడియంకు మంగళం పాడారు... డిజిటల్ క్లాస్రూమ్కు బైబై అన్నారు... టోఫెల్ క్లాసులకు టాటా చెప్పారు...సబ్జెక్ట్ టీచర్లపై వేటు వేశారు... గోరుముద్దను ఘోరంగా మార్చారు... ఆసాంతం విద్యా వ్యవస్థను నీరుగార్చారు... ఫలితం... ఫలితాలు దారుణంగా పడిపోయాయి. దీంతో ప్రభుత్వ బడులను వీడి విద్యార్థులు ప్రైవేటు బాట పడుతున్నారు.
⇒ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో స్వాతంత్య్రం అనంతరం ఎవరూ చేయని స్థాయిలో... వైఎస్ జగన్ పాలనలో సమూల విద్యా సంస్కరణలు ఉద్యమంలా సాగాయి. నాణ్యమైన విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విలసిల్లాయి. సర్కారీ బడుల్లో ఖాళీలు లేక.. ‘నో వేకెన్సీ’ బోర్డులు పెట్టేంత వరకు వెళ్లాయి. కానీ, కూటమి పాలనలో సంస్కరణలు నిలిచిపోయి.. సంక్షేమ పథకాలు అమలు కాక.. పరిస్థితులు తలకిందులయ్యాయి. రాష్ట్రంలో గురువారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
సాక్షి, అమరావతి : సంవత్సరం క్రితం వరకు ఎంతో గొప్ప ఫలితాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి నేడు దిగజారిపోయింది. వైఎస్సార్సీపీ పాలనలో మనబడి నాడు–నేడు పనులతో సకల సదుపాయాలతో వెలుగొందిన బడులు ఇప్పుడు జీవం కోల్పోయాయి. రికార్డు వ్యవధిలో ఫలితాలు అంటూ.. ఘనంగా చెప్పుకొన్న పదో తరగతి ఫలితాల్లోనే కూటమి సర్కారు డొల్లతనం బయటపడింది.
మోడల్ స్కూళ్ల పేరుతో వందల ప్రాథమిక పాఠశాలలను దూరంగా ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడంతోనే పనితీరు తేటతెల్లమైంది. సర్కారీ బడుల్లో ప్రమాణాలు పెంచే పనులను పక్కనపెట్టడంతోనే.. చంద్రబాబు ప్రభుత్వానిది ప్రైవేటు మోజు అని స్పష్టమైంది. ఇదే అదనుగా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు చెలరేగుతున్నాయి. ఈ ఏడాది ఫీజులను భారీగా పెంచేశాయి.
ఇక కార్పొరేట్ స్కూళ్లలో చదివించాలంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి. సగటున ఒక్కో స్కూల్లో 10 నుంచి 30 శాతంపైగా ఫీజులు పెంచేశాయి. వీటికి పుస్తకాలు, యూనిపారం ఖర్చులు అదనం. ప్రైవేటులో ఫీజులను నియంత్రించాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్నది లేదు. పిల్లల చదువులు భారంగా మారడంతో గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అంటేనే తల్లిదండ్రులు దిగాలు చెందుతున్నారు.
–2024 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులే అత్యధిక మార్కులతో టాపర్లుగా నిలిచారు. ఈ ఏడాది అధిక శాతం ప్రైవేటు విద్యార్థులే ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. దీంతో ‘షైనింగ్ స్టార్’ అవార్డులు వారికే దక్కాయి.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమూల విద్యా సంస్కరణలు
స్వాతంత్య్రం అనంతరం ఎవరూ చేయని స్థాయిలో అమలు
నాణ్యమైన విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చిన వైఎస్ జగన్
పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
నాడు సర్కారీ బడుల్లో ఖాళీలు లేక.. ‘నో వేకెన్సీ’ బోర్డులు
విద్యార్థుల యూనిఫాం సైతం వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించి ఎంపిక
నేడు నిలిచిపోయిన సంస్కరణలు.. అమలు కాని పథకాలు
వైఎస్సార్సీపీ పాలనకు, ఇప్పటికీ పూర్తి భిన్నంగా పరిస్థితులు
ప్రజా వ్యతిరేక విధానాలే మేలంటూ..
2024 జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజు నుంచి 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. కూటమి వచ్చిందే తడవుగా.. అప్పటిదాకా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలు, విద్యా సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను నిలిపివేసింది. పథకాలకు పేర్లు మార్చింది. విద్యా కానుక తప్ప ఇతర అన్నింటినీ రద్దు చేసింది. 16 రకాల పదార్థాలతో విద్యార్థులకు అందజేసిన ‘జగనన్న గోరుముద్ద’ను డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా పేరు మార్చిందేగాని నాణ్యతను గాలికి వదిలేసింది. దీంతో 50 శాతం మంది కూడా విద్యార్థులు తినలేని పరిస్థితి.
⇒ రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మూడు రకాల మెనూ అందిస్తామని రూ.కోట్ల ఖర్చుతో ప్రయోగాలు చేసిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేసింది.
⇒ ఇంట్లో విద్యార్థులు ఎంతమంది ఉంటే అందరికీ రూ.15వేలు తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఏడాదిగా ఎగ్గొట్టింది.
⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.8 వేల కోట్లతో మనబడి నాడు–నేడు రెండో దశ పనులు ప్రారంభించింది. 20 వేల పాఠశాలల అభివృద్ధి పనులను చేపట్టి, 4 వేల స్కూళ్లలో పూర్తిచేసింది. మిగిలిన పాఠశాలల్లో పనులను కూటమి ప్రభుత్వం అర్థంతరంగా నిలిపివేసింది.
⇒ గత ఏడాది జూలైలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించి ప్రాథమికోన్నత స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ బోధనను తొలగించింది. విద్యా సంవత్సరంలో దాదాపు 9 నెలలపాటు ఉపాధ్యాయుల సర్దు బాటు తోనే కాలంవెళ్లదీసి బోధనను బలహీనం చేసింది.
⇒ ప్రమాణాల మెరుగు కోసం 3–5 తరగతుల విద్యార్థులకు వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన సబ్జెక్టు టీచర్ చదువులను సైతం కూటమి సర్కారు రద్దు చేసింది.
⇒ వైఎస్సార్సీపీ వెయ్యి స్కూళ్లలో ప్రారంభించిన సీబీఎస్ఈ బోధనను కూటమి వచ్చాక ఎత్తివేశారు.
⇒ పేద విద్యార్థుల కోసం తెచ్చిన టోఫెల్, అంతర్జాతీయ ఐబీ విద్యను చంద్రబాబు ప్రభుత్వం దూరం చేసింది. డిజిటల్ క్లాస్రూమ్ కాన్సెప్్టను పక్కనపెట్టింది.
టెన్త్ పరీక్షల్లో ఘోరంగా ‘ఫెయిల్’
పరీక్షలు జరుగుతుండగానే ప్రశ్నపత్రాలు వాట్సాప్లో ప్రత్యక్షం... ఆపై ఫలితాల వెల్లడిలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర వైఫల్యం..! ఇదీ 2024–25 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలను కూటమి ప్రభుత్వం నిర్వహించిన తీరు. ఈ ఒక్క ఉదాహరణ చాలు... ప్రభుత్వం ఎంత ఘోరంగా ఫెయిలైందో చెప్పేందుకు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనిది... కూటమి ప్రభుత్వంలో ప్రశ్నపత్రం లీక్ కావడం ఒకప్పటి టీడీపీ పాలనను గుర్తు చేసింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, రికార్డు కక్కుర్తిలో తక్కువ రోజుల్లోనే ఫలితాల ప్రకటనతో తప్పిదాలు జరిగాయి. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఏకంగా 66 వేల దరఖాస్తులు అందాయి. పునః పరిశీలనలోనూ మళ్లీ తప్పులు జరిగాయి.
నాడు నో వేకెన్సీ బోర్డులు.. నేడు సర్కారు బడికి రాంరాం
చక్కగా సాగుతున్న సంస్కరణలను పక్కకుపెట్టి... సంక్షేమ పథకాలను ఎత్తివేసిన కూటమి.. ప్రభుత్వ విద్యలో ప్రయోగాలు చేస్తూ 2025–26 విద్యా సంవత్సరం నుంచి 9 రకాల పాఠశాలలను ప్రవేశపెట్టింది. ప్రజలు, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నా ఇదే మేలంటూ పాఠశాల విద్యను అంధకారంలోకి నెట్టేసింది. గత ఏడాది ప్రభుత్వ చర్యలతో ఏకంగా 4 లక్షల మందిపైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్లిపోయారని ముఖ్యమంత్రికే జిల్లాల కలెక్టర్లు నివేదిక ఇవ్వడం గమనార్హం.
ప్రస్తుతం ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని.. ఇదే విధానాలు కొనసాగితే ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి భిన్నంగా వైఎస్సార్సీపీ పాలనలోని పరిస్థితులను ప్రస్తావిస్తున్నారు. నాడు చేపట్టిన విద్యా సంస్కరణలు అద్భుత ఫలితాలు ఇచ్చాయని, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా నిలిచాయని గుర్తుచేస్తున్నారు.
విద్యార్థులతో కిటకిటలాడాయని పేర్కొంటున్నారు. ‘‘మా పాఠశాలలో సీట్లు లేవు’’ అంటూ గేట్లకు నో వేకెన్సీ బోర్డులు కూడా పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ విద్యార్థుల యూనిఫాంను స్వయంగా పరిశీలించి ఎంపిక చేసిన అంశాన్ని ఉదహరిస్తున్నారు.
విద్యార్థుల ప్రైవేటు బాట... ఫీజుల బాదుడు బాధ
కూటమి ప్రభుత్వ విద్యా విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు దిగజారడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రైవేటు స్కూళ్లల్లో ప్రవేశాలు తీసుకుంటున్నారు. దొరికిందే చాన్సుగా ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు ఫీజులు భారీగా పెంచేశాయి. ఏడాది కాలంలో సగటున 10 నుంచి 30 శాతం పైగా స్కూల్ ఫీజులు పెంచేయడంతో మధ్య తరగతి వర్గం తీవ్ర ఆందోళన చెందుతోంది.
గత ఏడాది ఓ కార్పొరేట్ స్కూల్లో 3వ తరగతి ఫీజు రూ.45 వేలు ఉంటే, ఇప్పుడు రూ.55 వేలకు పెరిగింది. పుస్తకాల ధర రూ.7 వేల నుంచి రూ.8,500కి చేరింది. ఏడాది కాలంలో వందపైగా కొత్త ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ అనుమతినిచ్చినట్టు అంచనా. సాధారణ బడ్జెట్ పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.12 వేలు ఫీజు, పుస్తకాలకు మరో రూ.3 వేలు వసూలు చేస్తుండగా, ఆరో తరగతికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు తీసుకుంటున్నారు.
పుస్తకాలకు మరో రూ.5 వేలు వెరసి రూ.30 వేలు అవుతోంది. వ్యవసాయ కుటుంబాలు, మధ్య తరగతి వర్గాల పిల్లలను చదివించే సెమీ కార్పొరేట్ పాఠశాలలు ఒకటో తరగతికి రూ.25 వేల నుంచి రూ.38 వేలు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలు నాన్ ఏసీ, ఏసీ తరగతులు అంటూ ఫీజులు బాదుతున్నాయి.
పిల్లల చదువులతో ఆర్థిక కష్టాలు
ఎలక్ట్రీషియన్గా కుటుంబాన్ని పోషిస్తున్న నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి 6వ తరగతి, అబ్బాయి 5వ తరగతికి వచ్చారు. ఇద్దరినీ స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నా. ఏడాదికి రూ.50 వేలు ఖర్చవుతున్నాయి. పిల్లలను చదివించేందుకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫీజులతో పాటు బుక్స్, యూనిఫాం, బ్యాగ్లు, బూట్లు, సాక్సులు వంటి సామగ్రి కొనుగోలు భారంగా మారింది. ఫీజులను ఇష్టారాజ్యం పెంచుకుంటూ పోతున్నారు.
–షేక్ బాజీ, గుంటూరు
చదువు భారంగా మారుతోంది
నాకు ముగ్గురు పిల్లలు. మా పెద్దబ్బాయి హాలహర్విలోని ఓ ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. ఏడాదికి రూ.20 వేలు ఫీజు చెల్లించాలి. ఫీజుతోపాటు బుక్స్, యూనిఫాం, షూకు రూ.4 వేలు ఖర్చు అవుతోంది. మాకున్న రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ.. కూలి పనులు చేసుకుని బతుకుతున్నాం. పిల్లల చదువుకు, వ్యవసాయానికి ఏటా రూ.50వేలు అప్పు చేయాల్సిన దుస్థితి.
– గాదిలింగప్ప, నిట్రవట్టి గ్రామం, హాలహర్వి మండలం, కర్నూలు జిల్లా