కూటమి సర్కారు తీరుకు నిరసనగా.. ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం రాజీనామా | Primary school HM resigns: Andhra pradesh | Sakshi
Sakshi News home page

కూటమి సర్కారు తీరుకు నిరసనగా.. ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం రాజీనామా

Jun 21 2025 4:55 AM | Updated on Jun 21 2025 6:26 AM

Primary school HM resigns: Andhra pradesh

చేజర్ల ఎంఈఓ కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని ఇస్తున్న హెచ్‌ఎం మధుసూదన్‌రావు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంచలన ఘటన

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ఆక్షేపణ

ఆత్మకూరు:  గత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం మెరుగైన ఆధునిక పద్ధతుల్లో విద్యార్థులకు బెంచీలు, కంప్యూటర్లు, డిజిటల్‌ బోర్డులు, తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది పాఠశాలలు పునర్నిర్మించారని.. కానీ, ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించిందంటూ ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సర్కారు తీరుపట్ల ఆయన నిరసన తెలుపుతూ శుక్రవారం తన ఉద్యోగానికి గుడ్‌బై చెప్పారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం కోటితీర్థం గ్రామ ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. మధుసూదన్‌రావు ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆగ్రహంతో ఈ రాజీనామా చేశారు. మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బందికి రాజీనామా లేఖ అందజేశారు. రాజీనామా పత్రంలో మధుసూదన్‌రావు ఆవేదన ఆయన మాటల్లోనే.. నేను 29 సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. ప్రస్తుతం కోటితీర్థం ఎంపీపీ పాఠశాల హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నా.

టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమైంది తప్ప విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయకపోగా పూర్తిగా భ్రష్టు పట్టించింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాను. ఈ అనాలోచిత నిర్ణయాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు నిర్ణయించుకుని నా ఉపాధ్యాయ వృత్తి (హెచ్‌ఎం)కి రాజీనామా చేశాను. ఎంఈఓ, డీఈఓల పేరుతో స్వహస్తాలతో రాజీనామా పత్రం రాసి కార్యాలయంలో అందచేశాను. ఈ ప్రభుత్వం ఆచరణ యోగ్యం కాని విధంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ఉ.6 గంటలకే యోగా శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యేలా చూడమనడం కష్టంగా ఉంది.

దీనికితోడు.. విద్యాశాఖ వింత పోకడలు, యాప్‌ల పేరుతో హాజరు, పాఠశాలకు హాజరయ్యే వేళలు నమోదు చేయడం.. నెట్‌వర్క్‌ సక్రమంగా లేని సమయంలో ఆలస్యం అవుతుండడంతో పై అధికారులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. 9.30 గంటలకు హాజరు పూర్తిచేయాల్సి ఉండగా నెట్‌వర్క్‌ సక్రమంగా లేక 11 గంటలకు పైగా దానితోనే సమయం సరిపోతోంది. ఈ విషయంలో ఉపాధ్యాయులది తప్పులేకున్నా వారిపైనే చర్యలు తీసుకుంటున్నారు.  

ఉపాధ్యాయులతో పనికిమాలిన పనులా? 
ఇక ఉ.6 గంటలకు మహిళా టీచర్లు యోగా తరగతులకు ఎలా వస్తారు? ఎలాంటి సౌకర్యాల్లేని పల్లెటూర్లలో నివసించడం కష్టంగా ఉండడంతో మండల, జిల్లా కేంద్రాల్లో ఉంటున్నారు. వీరు తెల్లవారుజామునే ఈ యోగా శిక్షణా తరగతుల కోసం పాఠశాలలకు ఎలా హాజరుకాగలరు? రెండునెలల క్రితం పాఠశాలల్లో బాత్‌రూమ్‌ల ఫొటోలు అడిగిన వెంటనే పంపలేదని పలువురు ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చారు. ఇటీవల జరిగిన టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌ను కూడా భ్రష్టు పట్టించారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.

నా 29 ఏళ్ల సర్వీసులో ఇంతటి బానిసత్వం ఎప్పుడూ చూడలేదు. పిల్లల చదువులు గాలికొదిలేసేలా యాప్‌లు, ఫొటోలు పంపమంటూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాదు. ఉపాధ్యాయుడిగా చదువులు చెప్పగలంగానీ, ఇలా ఇతర పనికిమాలిన పనులు ఉపాధ్యాయులతో చేయించడం మంచిది కాదన్న ఆవేదనతో రాజీనామా చేశాను.  ఈ విషయమై మండల విద్యాశాఖాధికారి శ్రీనివాసరావును సంప్రదించగా.. హెచ్‌ఎం రాజీనామా విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారికి తెలియజేశానని పేర్కొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement