ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మండలం కేవీ అగ్రహారంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ముగ్గురు చిన్నారులైన కూతుళ్లను హతమార్చి, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
కేవీ అగ్రహారానికి చెందిన సుధాకర్ కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో తన కూతుళ్లు అచ్యుత (11), పూజిత (9), లోహిత (8)లను హతమార్చాడు. తినే తిండిలో విషం పెట్టి చంపినట్లు తెలుస్తోంది. అనంతరం సమీపంలోని పొలంలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘటన గురించి సమాచారం అందుకున్న స్థానికులు, బంధువులు వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
కుటుంబ కలహాలే కారణమా?
ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబంలో నెలకొన్న విభేదాలు, కలహాల కారణంగానే సుధాకర్ ఈ దారుణానికి పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. అయితే అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామంలో విషాద ఛాయలు
ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. అల్లారుముద్దుగా పెరిగిన ముగ్గురు చిన్నారులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటన గురించి తెలిసినవారంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


