విషాదం.. పెన్షన్‌ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్దురాలు మృతి | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో విషాదం.. పెన్షన్‌ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్దురాలు మృతి

Published Wed, Apr 3 2024 4:39 PM

Old Age Woman Dies While Standing In Line For Pension Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా:  కృష్జా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెనమలూరు మండలం గంగూరులో పెన్షన్‌ కోసం వెళ్లిన వృద్దురాలు వడదెబ్బ తగిలి మృతిచెందింది. పెన్షన్‌ కోసం వెళ్లి వడదెబ్బతో వజ్రమ్మ(80) ప్రాణాలు విడిచింది. ఉదయం నుంచి పెన్షన్‌ కోసం పడిగాపులు కాసిన వజ్రమ్మ వడదబ్బతో అక్కడే కుప్పకూలిపోయింది. పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పెన్షన్‌ పంపిణీ జరుగుతోంది. ఏప్రిల్‌ 3 నుంచి 6 వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనా­రోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్‌ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం వారి ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తున్నారు. 

ఇదిలా ఉండగా నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది.

చంద్రబాబు అండ్‌ కో కుటిల రాజకీయాలకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.  లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. పెన్షన్ల కోసం బారులు తీరారు. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు కారణంగా పింఛన్ల పంపిణీ నిలిచిపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. బాబుకు ఓటుతో బుద్ధి చెప్తామంటున్నారు పెన్షనర్లు.

Advertisement
Advertisement