మల్కాపురం: ఒక నేవల్ ఉన్నతాధికారి భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేవల్ కమాండర్ విశాల్ దాబీ, ఆయన భార్య ధర్తి దాబీ గత కొంతకాలంగా నేవల్ పార్కులోని క్వార్టర్ నంబర్–3లో నివాసముంటున్నారు. ఆదివారం రాత్రి భర్త విశాల్ విధులకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ధర్తి దాబీ తన గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఐఎన్ఎస్ కల్యాణి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు సోమవారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసి ఆమె మరణానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


