భర్తను కాదని.. వేరే వ్యక్తితో పరిచయం..! | mysterious Of married woman Missing Case | Sakshi
Sakshi News home page

భర్తను కాదని.. వేరే వ్యక్తితో పరిచయం..!

Jun 18 2025 11:53 AM | Updated on Jun 18 2025 12:24 PM

mysterious Of married woman Missing Case

మిస్టరీగా మారిన వివాహిత మృతి

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు 

భీమునిపట్నం: భీమిలిలో నెల రోజుల క్రితం అదృశ్యమైన మహిళ మంగళవారం బీచ్‌రోడ్డులోని జీడి తోటలో శవమై కనిపించింది. కృష్ణాకాలనీకి చెందిన బంగారు కవిత (28) గత నెల 10న సరకులు తీసుకువస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె భర్త పైడిరాజు ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కవిత అదృశ్యంపై ఆమె భర్త, కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. కాగా.. బీచ్‌రోడ్డులోని మార్లిన్‌ కే రెస్టారెంట్‌ ఎదురుగా ఉన్న జీడి తోటలో ఒక చెట్టు కొమ్మకు వేలాడుతున్న మహిళ తల, వేరుపడిన శరీరం ఉండడాన్ని కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ తిరుమలరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

హత్య? ఆత్మహత్య? 
కవిత మృతి విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనేది తేలాల్సి ఉంది. అదృశ్యమైన ఒకటి, రెండు రోజుల్లోనే ఆమె చనిపోయి ఉండవచ్చని తెలుస్తోంది. మంగళవారం వరకు మృతదేహం ఎవరికీ తెలియకపోవడంతో తల నుంచి శరీరం నేల మీద పడిపోయి, బాగా పాడైపోయిన స్థితిలో ఉంది. దీంతో పోస్టుమార్టంను అక్కడే నిర్వహించారు.

పోలీసుల దర్యాప్తులో ఆమెకు ఒక వ్యక్తితో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో ఏదైనా గొడవలు జరిగి ఇక్కడకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడిందా, లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, తాము ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు సరైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందువల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు బీచ్‌రోడ్డులో నిరసన తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement