బీచ్రోడ్డు: రాష్ట్రంలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లు, గుర్తింపు కల్పించేలా కృషి చేయడమే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం (ఏపీజేఎఫ్) ప్రధాన లక్ష్యమని ఆ సంఘం వ్యవస్థాపకుడు, గౌరవాధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు తెలిపారు. బుధవారం ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీజేఎఫ్ మహాసభ సన్నాహక కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. 60 ఏళ్లు నిండిన లేదా 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రైల్వే పాస్ కోసం త్వరలో కేంద్ర మంత్రిని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శివ రాజేష్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను నిరంతరం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్న సంఘం ఏపీజేఎఫ్ అని పేర్కొన్నారు. అనంతరం ఏపీజేఎఫ్ ఉమ్మడి విశాఖ జిల్లా అడహాక్ కమిటీ కన్వీనర్లుగా సీనియర్ జర్నలిస్టులు బి.రవికాంత్, పి.ఎ.రావు, వై.నాగేశ్వరరావు, దుర్గాప్రసాద్, యూసఫ్లను ప్రకటించారు.


