నేడు, రేపు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు
సాక్షి, అమరావతి: ఈ–బస్సుల ముసుగులో ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైంది. మంగళవారం నుంచి ధర్నాలు చేపట్టబోతోంది. ఉద్యోగ సంఘాల జేఏసీ ఇప్పటికే తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ–బస్సులను ఆర్టీసీయే నిర్వహించాలని, ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేయాలని, కొత్త బస్సులు కొనుగోలు తదితర డిమాండ్లతో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రమణ్యంకు వినతిపత్రాలు సమర్పించింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతోంది. మంగళ, బుధవారాల్లో అన్ని ఆర్టీసీ డిపోలు, యూనిట్లలో ధర్నాలు నిర్వహించనుంది.


