
తిరుపతి సిటీ: చిన్నప్పుడు అమ్మ కొంగుపట్టుకుని తిరుగుతాం. పెద్దయ్యాక ఆమెను ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే మనసు రాదు. వృద్ధులైన తల్లిదండ్రులను భారంగా భావిస్తున్న రోజులివీ.. ఈనాటి రోజుల్లోనూ తల్లిని అమితంగా ప్రేమించే తనయులు ఉన్నారంటే అతిశయోక్తికాదు. ఈ కోవకు చెందిన వారే మైసూరుకు చెందిన దక్షిణామూర్తి కృష్ణకుమార్.
ఆయనో సాఫ్ట్వేర్ ఉద్యోగి. 75 ఏళ్ల తల్లి రత్నమ్మ కోరికను తీర్చేందుకు టీమ్లీడర్ స్థాయి ఉద్యోగాన్ని నెలకు రూ.1.60 లక్షల వేతనం వస్తున్నా త్రుణప్రాయంగా వదిలేశారు. అమ్మతో కలిసి 2018 జనవరి 16న పుణ్యక్షేత్రాల యాత్ర చేపట్టారు. ద్విచక్రవాహనంపైనే సుమారు 98,152 కిలోమీటర్లు అమ్మతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర సాగించారు. లక్షకుపైగా పుణ్యక్షేత్రాలు సందర్శించారు. ఆదివారం సాయంత్రం తిరుపతి కోదండరామస్వామి దేవస్థాన సమీపంలోని శృంగేరి మఠానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా కృష్ణకుమార్ తన యాత్ర విశేషాలు పంచుకున్నారు. దేశంతోపాటు భూటాన్, మయన్మార్, నేపాల్ దేశాల్లోని పుణ్యక్షేత్రాలనూ సందర్శించినట్టు చెప్పారు. మరో పదిరోజుల్లో స్వస్థలానికి చేరకుంటామని, ఇక ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండి తల్లికి సేవ చేసుకుంటానని వెల్లడించారు. మరో జన్మంటూ ఉంటే కృష్ణకుమార్ తల్లిగానే పుట్టాలని ఉందని రత్నమ్మ తన గుండెల్లో నుంచి పొంగుకొస్తున్న సంతోషాన్ని ఆనందబాష్పాలతో పంచుకోవడం విశేషం.