మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
వాతావరణ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర తీరప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ఈ ద్రోణి విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. వీటి ప్రభావంతో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రాంతంలో 6.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
విజయనగరం జిల్లా రాజాంలో 5.2, గుంటూరు జిల్లా కాకుమానులో 5.1, తాడేపల్లిలో 4.5, ఎన్టీఆర్ జిల్లా కవులూరులో 4.1, బాపట్ల జిల్లా భట్టిప్రోలులో 3.9 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది.


