
విజయవాడ: సింహాచలం ఘటనపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో భక్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరును తప్పుబట్టారు.
గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టత ఉంటుందో. సింహాచలంలో చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకాని తనంతో ప్రమాదం జరిగింది. మూడు, నాలుగు రోజుల క్రితం గోడ నిర్మించారు. గోడ నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. గోడ ప్లెక్సీ ఊగినట్లు ఊగిందని సాక్షులు చెప్పారు. కొండవాల్లో కాంక్రీట్ వాల్ నిర్మించాలి. ఇటుక బెడ్డలతో నిర్మాణం చేపట్టరాదు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు.
చనిపోయిన వారి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. సంఘటన తెలిసిన వెంటనే వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేజీహెహెచ్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగింది. కొండపై చాలా గోడలు ఉన్నాయి. అవి ఎందుకు పడుపోలేదు. నాణ్యాత లోపించింది కాబట్టే గోడ పడిపోయింది’ అని ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది...అచేతనంగా మారిపోయింది . ప్రత్యర్ధుల్ని ఇబ్బంది పెట్టడానికి వారికి కావాల్సిన పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తుంది. తిరుపతి లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చి వైఎస్ జగన్పై బురద చల్లాలని చూశారు. చందనోత్సవంలో అపశృతి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే.
మంత్రులు,ప్రభుత్వం చేతకాని తనంతోనే భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాగలరా. రాష్ట్ర పండుగగా జరుపుకునే ఉత్సవానికి లోపభూయిష్టంగా ఏర్పాట్లు చేయడమేంటి. ఇంతపెద్ద ఘటన జరిగితే తప్పించుకునే ధోరణితో మంత్రులు , అధికారులు వ్యవహరిస్తున్నారు.

వరుస అపచారాలు జరుగుతున్నా మొద్ద నిద్ర వీడటం లేదు. ఎంక్వైరీల పేరుతో ట్వీట్లు , ప్రకటనలు చేస్తే సరిపోతుందా?.ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు. ఈ ప్రభుత్వానికి హిందూ ఆలయాల పట్ల, దైవ దర్శనాలకు వచ్చే భక్తుల పట్ల చిత్త శుద్ధి లేదు. ఐదుగురు మంత్రులు రివ్యూలు చేశామన్నారు.
మీ రివ్యూలు టిక్కెట్ల పంపకాలు ..ప్రోటోకాల్ దర్శనాల కోసమేనా. భక్తుల ప్రాణాలంటే మీకు లెక్కలేదా. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. మేం పదే పదే హెచ్చరిస్తున్నా .. ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదు.
సనాతన ధర్మం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో భక్తులు చనిపోయారు. కాశీనాయన క్షేత్రాన్ని కూలదోశారు. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. ఇప్పడు సింహాచలం చందనోత్సవంలో భక్తులు చనిపోయారు. ఏపీలో దైవదర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి క్షేమంగా వెళతారనే నమ్మకం లేకుండా పోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.