సాక్షి, విజయవాడ: జత్వానీ కేసులో కూటమి కుట్రలు బట్టబయలయ్యాయి. జత్వానీని వేధించారంటూ గతంలో కూటమి మంత్రులు రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. అయితే, జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని సీఐడీ తేల్చింది. జత్వానీపై నమోదైన కేసులో సిఐడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. జత్వానీ బ్లాక్ మెయిల్ చేసిందని.. బెదిరించి పెద్ద ఎత్తుల డబ్బులు వసూలు చేసినట్టు సీఐడీ నిర్థారించింది. కుక్కల విద్యాసాగర్ నుండి డబ్బులు గుంజినట్టు వెల్లడించింది.
1.31 కోట్లు బ్లాక్ మెయిల్ చేసి లాగేసిందని.. బ్యాంకు లావాదేవీలను సాంకేతికంగా సీఐడీ నిర్ధారించింది. గతంలో పారిశ్రామిక వేత్త జిందాల్ని బ్లాక్ మెయిల్ చేసిన జత్వానీని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెనకేసుకొచ్చారు. జత్వానీని ఏపీకి రప్పించి తప్పుడు కేసులు పెట్టించిన ప్రభుత్వం.. స్టార్ హోటళ్లు, ఫ్లైట్లు, ప్రోటోకాల్తో జత్వానీని ట్రీట్ చేసింది. దుర్గ గుడిలో ప్రోటోకాల్ దర్శనాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం చేయించింది.
జత్వానీ కేసు పేరుతో ఐపీఎస్ అధికారులపై కక్ష సాధించిన ప్రభుత్వం.. డీజీ పీఎస్ ఆర్ ఆంజనేయులు, సీపీ క్రాంతిరాణా టాటాలపై కేసులు పెట్టి.. సస్పెన్షన్ చేసింది. డీసీపీ విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావులపైన కూడా కేసులు పెట్టి సస్పెన్షన్ చేసింది. జత్వానీ పేరుతో పోలీస్ అధికారులను చంద్రబాబు ప్రభుత్వం వేధించింది. ఇప్పుడు జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని తేలింది. సాక్షాత్తూ హోంమంత్రి అనిత దగ్గరుండి కేసు పెట్టించిన సంగతి తెలిసిందే. జత్వానీని వీఐపీలా ట్రీట్ చేసి కూటమి నేతలు అభాసుపాలయ్యారు.


