సాక్షి, విశాఖపట్నం: మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. బోటు గల్లంతు ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున చెక్కులను వైఎస్సార్సీపీ నేతలు అందజేశారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, బడుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. బోటు ప్రమాద ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులు ఎవరూ పరామర్శించలేదు. బోటు ప్రమాద ఘటన తెలిసిన వెంటనే వైఎస్ జగన్ స్పందించి ఆదుకుంటామని మాట ఇచ్చారు. కేవలం రూ.10 లక్షలు సాయం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. వైఎస్ జగన్ చెప్పిన మాట ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షలు సాయం చేశారు. బోటు డ్రైవర్ చిన్నాను ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ జగన్.. చిన్నాతో సహా అందరికీ సాయం అందించారు. మత్స్యకారులను ఆదుకొని జగన్ తన దాతృత్వం చాటుకున్నారు. ఆయన సంతకం చేసి చెక్కులను పంపించారు. బాధిత కుటుంబాలకు చెక్కులు అందించాం.
గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. బాధిత మత్స్యకార కుటుంబాలను వైఎస్ జగన్ ఆదుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం స్పందించలేదు. విపత్తు నిర్వహణ శాఖ చూసే మంత్రి కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. సంబంధిత శాఖ మంత్రి వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. మత్స్యశాఖ మంత్రి రోజూ విజయవాడ వెళ్తారు కానీ బాధిత కుటుంబాలను మాత్రం పరామర్శించరు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం అండగా ఉంటాం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని జగన్ చెప్పమని పంపించారు.
మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. బోటు ప్రమాద ఘటనలో ఈ ప్రభుత్వం స్పందించిన తీరు దారుణం. మత్స్యకారులంటే ఈ ప్రభుత్వానికి అంటరానితనం. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే మత్స్యకారులకు మంచి జరిగింది. మత్స్యకారులకు సాయం అందించిన వ్యక్తి వైఎస్ జగన్. మత్స్యకారులంటే జగన్కు ఎనలేని ప్రేమ. మత్స్యకారుల పెన్షన్ కోసం చంద్రబాబుని అడిగితే కన్నెర్ర చేసేవాడు. డీజిల్ సబ్సిడీ ఇచ్చిన ఘనత జగన్ది. బాబు ప్రతీ మ్యానిఫెస్టోలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ పెడతా అని పెట్టారు. అది వైఎస్ జగన్ చేసి చూపించారు..
బడుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ.. మత్స్యకారులు గల్లంతయితే ప్రభుత్వానికి స్పందన లేదు. మత్స్యకారుల బాధ, ఆవేదన మాకు తెలుసు. మా పార్టీ తరఫున రూ. 49 లక్షల సాయం బాధితులకు అందించాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే బాధిత కుటుంబాలకు సాయం అందిస్తాం..
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. బోటు ప్రమాదం దురదృష్టకరం. మత్స్యకారుల గల్లంతు ఘటనలో ప్రభుత్వం స్పందించిన తీరు దారుణం. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కేవలం రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వైఎస్ జగన్ మానవత్వంతో స్పందించారు. మత్స్యకారులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా.. పరామర్శకు ఎందుకు రాలేదంటే కంటి ఆపరేషన్ అంటూ కుంటి సాకులు చెప్తున్నారు అచ్చెన్నాయుడు. హోం మంత్రి కూడా బాధిత కుటుంబాలను పరామర్శించడానికి రాలేదు.


