సత్యం బాలాజీ రైస్‌ ఇండస్ట్రీస్‌లో ఐటీ సోదాలు | IT Searches At Satyam Balaji Rice Industries In Kakinada, Check More Details Inside | Sakshi
Sakshi News home page

సత్యం బాలాజీ రైస్‌ ఇండస్ట్రీస్‌లో ఐటీ సోదాలు

Jan 30 2025 5:56 AM | Updated on Jan 30 2025 10:58 AM

IT searches at Satyam Balaji Rice Industries

మేనేజర్‌ ఇల్లు, సంస్థ గోడౌన్లలో ముమ్మర తనిఖీలు

కీలక ఫైళ్లు స్వాధీనం

కాకినాడ క్రైం: కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు చేపడుతున్న సత్యం బాలాజీ రైస్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ కేంద్రంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం కాకినాడ తిలక్‌రోడ్‌లో ఉన్న సంస్థకు చెందిన మూడు గోడౌన్‌లతో పాటు జగన్నాథపురంలోని సంస్థ మేనేజర్‌ కళ్యాణపు అశోక్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. మూడు బృందాలు తనిఖీల్లో పాల్గొనగా రెండు బృందాలు అశోక్‌ ఇంట్లో తనిఖీలు చేపడుతున్నాయి. ఓ బృందం సంస్థ గోడౌన్‌లను జల్లెడ పడుతోంది. 

అశోక్‌ ఇంటి నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గతేడాది నవంబర్‌ 23వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతులపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్టెల్లా ఎల్‌ పనామా నౌక నుంచి 1,320 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం కాకినాడ తీరం నుంచి అక్రమంగా ఆఫ్రికా దేశాలకు తరలి వెళ్లేందుకు సిద్ధం చేసినట్లు గుర్తించారు. 

వెంటనే సీజ్‌ ద షిప్‌ అంటూ అధికారులను ఆదేశించారు. ఈ బియ్యం సత్యం బాలాజీ ఇండస్ట్రీస్‌కి చెందినవిగా తేలింది.  దీంతో ఆదాయపన్ను శాఖ అప్రమత్తమై సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో గడచిన నాలుగు రోజు లుగా తనిఖీలు నిర్వహిస్తోంది. కొనసాగింపుగా కాకినాడలోనూ సోదాలు నిర్వహిస్తోంది.  

కొద్ది రోజుల క్రితం పెద్దాపురం లలితా రైస్‌ ఇండస్ట్రీస్‌లో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు స్వల్ప వ్యవధిలోనే సత్యం బాలాజీ ఇండస్ట్రీస్‌లో సోదాలు నిర్వహించడం, ప్రభుత్వ ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేయడం బియ్యం వ్యాపారుల్లో ఆందోళనకు కారణమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement