బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్లో సస్టెనబులిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్, ఎనర్జీ స్టోరేజ్ వంటి రంగాలకు భవిష్యత్తులో అత్యంత ప్రాధాన్యత ఉంటుందని జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. జేఎన్టీయూకే వర్సిటీ కాకినాడ, గ్రీన్కో, గ్రీన్కో స్కూల్ ఆఫ్ సస్టెనబులిటీ, ఐఐటీ హైదరాబాద్ మధ్య పరిశ్రమల అనుసంధానానికి మంగళవారం ఎంఓయూ కుదిరింది. ఈ సందర్భంగా వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్, కో ఆర్డినేటర్, మాజీ వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు, గ్రీన్కో ప్రతినిధి పరవస్తు రాంబాబు, ఐఐటీ హెచ్ ప్రొఫెర్ సీహెచ్ సుబ్రహ్మణ్యం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. వీసీ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులను కేవలం ఉద్యోగాలకు సిద్ధం చేయడమే కాకుండా దేశ సుస్థిర అభివృద్ధికి అవసరమైన పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడమే జేఎన్టీయూకే లక్ష్యమన్నారు. గ్రీన్కో వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాల ద్వారా పరిశోధన అవకాశాలు వస్తాయన్నారు. కో ఆర్డినేటర్ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు మాట్లాడుతూ గ్రీన్కో తరఫున ప్రతి ఏడాది పది మంది ఎంటెక్ విద్యార్థులకు నెలకు రూ.10 వేల చొప్పున రెండేళ్ల పాటు అందిస్తారని, అలాగే ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులకు నెలకు రూ.40 వేల చొప్పున నాలుగేళ్లపాటు డాక్టోరల్ పెలోషిప్లు అందిస్తారన్నారు. ఐఐటీ హెచ్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్రీన్కో భాగస్వామ్యం ద్వారా సుస్థిర ఇంజినీరింగ్ విద్య, పరిశోధన మరింత బలోపేతం అవుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ పద్మరాజు, మాజీ వీసీ మురళీకృష్ణ, శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, కృష్ణ ప్రసాద్, బీటీ కృష్ణ, ప్రొఫెసర్ నరేష్ పాల్గొన్నారు.


