బైపాస్‌ సర్జరీ నేపథ్యంలో రెండు నెలలు పొడిగించిన హైకోర్టు | Interim Bail extended to PSR Anjaneyulu Due to Health Problems: Andhra Pradesh High Court | Sakshi
Sakshi News home page

బైపాస్‌ సర్జరీ నేపథ్యంలో రెండు నెలలు పొడిగించిన హైకోర్టు

Jun 27 2025 4:09 AM | Updated on Jun 27 2025 4:09 AM

Interim Bail  extended to PSR Anjaneyulu Due to Health Problems: Andhra Pradesh High Court


సాక్షి, అమరావతి: ఏపీపీఎస్‌సీ గ్రూప్‌–1 జవాబు పత్రాల మూల్యాంకనం వ్యవహారంపై నమోదైన కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులుకు కింది కోర్టు జారీ చేసిన మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఎస్సార్‌ ఆంజనేయులు తరఫున న్యాయవాది నగేష్‌రెడ్డి వాదనలు వినిపించారు.

అనారోగ్య కారణాలతో పిటిషనర్‌కు కింది కోర్టు రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిందన్నారు. ఈ గడువు గురువారంతో ముగుస్తుందని చెప్పారు.ఈ నెల 25న పీఎస్సార్‌ ఆంజనేయులుకు బైపాస్‌ సర్జరీ జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు. కాబట్టి ఆయన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... పీఎస్సార్‌ ఆంజనేయులుకు 2 నెలల పాటు మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 28కి వాయిదా వేశారు.

మధుసూదన్‌కు వైద్య పరీక్షలు చేయించి నివేదికివ్వండి
ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న క్యామ్‌సైన్‌ సంస్థ డైరెక్టర్‌ పమిడికాల్వ మధుసూదన్‌ బెయిల్‌ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణరావు తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేశారు. పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని మధుసూదన్‌ చెబుతున్న నేపథ్యంలో గాల్‌బ్లాడర్, కిడ్నీ వ్యాధుల వైద్యులతో ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించి, నివేదికను తమ ముందుంచాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement