బాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించినందుకు కేసులు
ఏ–1గా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప.. 33 మందిపై కేసులు నమోదు
ఏపీలో యథేచ్ఛగా అధికార దుర్వినియోగం
పుంగనూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గురువారం పుంగనూరులో ఆ పార్టీ శ్రేణులు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా శాంతియుతంగా నిరసన తెలుపగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్పతో సహా పలువురిపై పుంగనూరు పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.
వివరాలిలా.. రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పి.మిథున్రెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో గురువారం పార్టీ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, బాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్లను తగలబెట్టే కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారు. దీనిపై అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేసింది. హనీఫ్బాషా అనే వ్యక్తి వద్ద పోలీసులు స్టేట్మెంట్ తీసుకుని జాతీయ రహదారిపై ప్రజలకు ఇబ్బంది కలిగించడంతో పాటుప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని సాకుగా చూపుతూ 33 మందిపై అక్రమ కేసులు నమోదు చేశారు.
ఇందులో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్పను ఏ–1గా చేర్చడంతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్దీన్ షరీఫ్, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి జయరామిరెడ్డి, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, మాజీ ఎంపీపీ నరసింహులు, పార్టీ పట్టణ, మండల కన్వినర్లు ఇర్ఫాన్, అమరనాథరెడ్డి, మైనార్టీ నాయకుడు మమ్ముతో పాటు మరో 22 మందిపై కేసు నమోదు చేశారు. దీనిపై మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో బెదిరిస్తోందని, ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. తెలుగుదేశం మోసాలను ప్రజలకు వివరించి, తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు.


