
ఇప్పటికే 36 రోజులుగాజ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు
ఆరోపణల్లో తీవ్రత, దర్యాప్తు పురోగతి అన్నీ పరిగణనలోకి తీసుకున్నాం
ఇప్పటికే 50 మందికి పైగా సాక్షులను విచారించారు
ఈ కేసులో మిగతా నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరు
తదుపరి చర్యలన్నీ కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు
పలు షరతుల వల్ల పిటిషనర్ చట్టం నుంచి పారిపోలేరు
పోలీసులపై ఫిర్యాదు.. వారిని ప్రాసిక్యూట్ చేయడంపై సీఆర్పీసీ సెక్షన్ 195 కింద నిషేధం ఉంది
తీర్పులో స్పష్టం చేసిన న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు
సాక్షి, అమరావతి: ముంబయి సినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పీఎస్సార్ ఆంజనేయులు ఇప్పటికే 36 రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు తన తీర్పులో పేర్కొన్నారు. ఆరోపణల్లో తీవ్రత, దర్యాప్తు పురోగతి, ముగిసిన పోలీసు కస్టడీ, కేసులో పిటిషనర్ పాత్ర తదితరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పీఎస్సార్ ఆంజనేయులుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
దర్యాప్తు అధికారి ఇప్పటికే 50 మందికి పైగా సాక్షులను విచారించారన్నారు. కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేస్తే పిటిషనర్ చట్టం నుంచి పారిపోయే అవకాశం లేదన్నారు. ఇప్పటికే ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారని న్యాయమూర్తి గుర్తు చేశారు. అంతేకాక జత్వానీ కేసులో ఇతర నిందితులైన పోలీసు అధికారులకు హైకోర్టు గతంలోనే ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని, అలాగే తదుపరి చర్యలన్నీ కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
ఓ అమాయక వ్యక్తిపై తప్పుడు కేసు బనాయించారా అన్న విషయాన్ని తేల్చాల్సింది సంబంధిత కోర్టులేనన్నారు. పోలీసులపై ఫిర్యాదు చేయడం, వారిని ప్రాసిక్యూట్ చేయడంపై సీఆర్పీసీ సెక్షన్ 195 కింద నిషేధం ఉందని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు కాపీ శుక్రవారం సాయంత్రం అందుబాటులోకి వచ్చింది.
మీడియాతో మాట్లాడకూడదు
ఈ కేసు గురించి మీడియాతో సహా ఎవరి ముందూ కూడా మాట్లాడటానికి వీల్లేదని పీఎస్సార్ ఆంజనేయులును హైకోర్టు ఆదేశించింది. రూ.20 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, చార్జిషీట్ దాఖలు చేసేంత వరకు ప్రతి రెండో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 లోపు సీఐడీ దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని చెప్పింది.
కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, కోర్టులో పాస్పోర్ట్ సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. దర్యాప్తునకు సహకరించాలని, ఇంకా ఎప్పుడు అవసరమైతే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని.. ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన వారిని ప్రత్యక్షంగా, పరోక్షంగా భయపెట్టడం, బెదిరించడం, ప్రలోభపెట్టడం చేయరాదని హైకోర్టు చెప్పింది.