సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో వర్షం దంచికొట్టింది. భారీ వర్షానికి గుడివాడ బస్టాండ్ జలమయమైంది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి బస్టాండ్ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. దీంతో, బస్టాండ్ ప్రాంగణం చిన్నపాటి చెరువును తలపిస్తోంది. బస్టాండ్ ఆవరణలో మోకాళ్ల లోతు నీరు చేరుకుంది. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల వద్దకు చేరుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. నిలబడేందుకు కూడా స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, డ్రైవర్లు బస్సులను లోపలకు తీసుకురాకుండా బయట ప్రధాన రహదారిపైనే నిలిపేస్తున్నారు.
మరోవైపు.. ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. తిరువూరు, ఇబ్రహీంపట్నం-జగదల్పూర్ వెళ్ళే జాతీయ (NHAI-30) రహదారిపై లక్ష్మీపురం వద్ద భారీ వృక్షం రోడ్డుపై పడిపోయింది. తిరువూరు-విసన్నపేట వెళ్లే దారిలో మల్లెల గ్రామం వద్ద ప్రధాన రహదారిపై చెట్టు పడిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఇదే పరిస్థితి ఉంది. చెట్లు పడిపోవడంతో జేసీబీ, యంత్రాల సహాయంతో రెస్క్యూ టీమ్ చెట్లను తొలగిస్తున్నారు.


