ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్థల్లో సైతం ఫీజుల కోసం వేధింపులు
రాష్ట్రంలో ఉన్నత విద్య వ్యవస్థను దివాలా తీయిస్తున్న చంద్రబాబు సర్కార్
విద్యార్థుల నుంచి బలవంతంగా వసూలు.. లేదంటే బాండ్ రాసివ్వాలంటూ ఒత్తిడి
ఆర్జీయూకేటీ స్నాతకోత్సవ వేళ విద్యార్థుల మెడపై ఫీజుల కత్తి
ఒక్కో విద్యార్థి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పైగా పెండింగ్ ఫీజులు చెల్లించాలని హుకుం
లేకుంటే స్నాతకోత్సవానికి రానివ్వబోమంటూ వర్సిటీ ఆదేశాలు
ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఇలా ఉంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పరిస్థితి దేవుడెరుగు.. కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి ఫీజు
రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ఎత్తుగడ
ప్రైవేటు కళాశాలలు సైతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన దుస్థితి
ఫలితంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు
చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్
ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీల కింద రూ.10,300 కోట్లకుపైగా బకాయిలు.. కానీ ఈ బడ్జెట్లో చూపింది రూ.2,766 కోట్లే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను చంద్రబాబు సర్కార్ దివాలా తీయిస్తోంది. పేదింటి విద్యార్థులకు ఉచిత విద్యను దూరం చేస్తూ పైశాచిక పాలన సాగిస్తోంది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోయినా, చీమకుట్టినట్టుగా కూడా లేకుండా దగాకోరుతనం ప్రవర్తిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల మెడపై కత్తి పెట్టి ఫీజులు వసూలు చేస్తుంటే కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. ఫీజు బకాయిలు చెల్లిస్తే తప్ప, సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ సంస్థలుగా సేవలందిస్తున్న విశ్వవిద్యాలయాలు సైతం మరో అడుగు ముందుకేసి ఫీజు బకాయిలకు సంబంధించి వంద రూపాయల బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు తీసుకోవడం విస్తుగొలుపుతోంది.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాబూలి వ్యాపారి కంటే ఘోరంగా ఏపీలోని విద్యా సంస్థలు పేదింటి విద్యార్థులను ఫీజుల కోసం పీడిస్తుండటం దిగజారిన విద్యా దుస్థితికి అద్దం పడుతోంది. వాస్తవానికి పాత బకాయిలతో పాటు 2026–27 విద్యా సంవత్సరంలో చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీల కింద రూ.10,300 కోట్లు ఖర్చు చేయాలి. కానీ, బడ్జెట్లో మాత్రం రూ.2,766 కోట్లు మాత్రమే చూపించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటిదాక ఇచ్చింది రూ.2,800 కోట్లు మాత్రమే. ఫలితంగా ఇంకా రూ.6,400 కోట్లు బకాయి ఉంది. దీనిని గమనించిన విద్యా, ఆరి్థక వేత్తలు నెమ్మదిగా ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ సంపూర్ణంగా ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. 
ఫీజులు విద్యార్థులే కట్టాలంటూ వంద రూపాయల స్టాంప్ పేపర్పై సంతకాలు తీసుకున్న ఆర్జీయూకేటీ
రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు కట్టాల్సిందే
2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. అంతకు ముందు మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో పేదింటి విద్యార్థుల భవిష్యత్తుకు జీవం పోశారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గాలికి వదిలేసింది. ఫలితంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు సైతం ప్రభుత్వంపై నమ్మకం లేదని, అసలు ఫీజు డబ్బులు విడుదల చేసే పరిస్థితి లేదని అభిప్రాయానికి వచ్చాయి. దీంతో విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో ఫీజుల పీడింపులు, వేధింపులు పెచ్చుమీరాయి.
ఈనెల 27న స్నాతకోత్సవం అని ప్రకటించిన వర్సిటీ యాజమాన్యం.. ఇంజనీరింగ్ పట్టా పొందాలంటే ఫీజు బకాయిలు మొత్తం ఒకేసారి కట్టాలని షరతు విధించడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. 2024, 2025లో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ ప్రదానం చేయాలంటే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెండింగ్ ఫీజులను కట్టాల్సిందేనని హుకుం జారీ చేసింది. లేదంటే ఫీజు బకాయి ఉన్నట్లు వంద రూపాయిల బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు తీసుకుంటోంది. ఈ వ్యవహారం భారీగా దుమారం రేపుతోంది. ఇలా నాలుగు బ్యాచుల్లో 16 వేల మందికిపైగా విద్యార్థుల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్లు అవసరమైతే అప్పులు చేసి రూ.లక్షల్లో ఫీజులు చెల్లించడం ఆర్జీయూకేటీలో పరిపాటిగా మారింది. 
ఫీజులు విద్యార్థులే కట్టాలంటూ వంద రూపాయల స్టాంప్ పేపర్పై సంతకాలు తీసుకున్న ఆర్జీయూకేటీ
97 శాతానికిపైగా పేదింటి విద్యార్థులే
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదింటి విద్యార్థులు ఉన్నత స్థాయి సాంకేతిక విద్యను అందుకోవాలని మహానేత వైఎస్సార్ ఉమ్మడి ఏపీలో ఆర్జీయూకేటీ కింద ట్రిపుల్ ఐటీలను ప్రవేశపెట్టారు. 10వ తరగతి తర్వాత నేరుగా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ను అభ్యసించేలా ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చారు. రెండు సంవత్సరాల ప్రీ–యూనివర్సిటీ కోర్సు(పీయూసీ), 4 సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీగా బోధన సాగిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులకు ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు రెసిడెన్షియల్ క్యాంపస్లలో చదువు నేర్పించేలా మహోన్నత ఆశయంతో ఆర్జీయూకేటీని స్థాపించారు. ఇందులో ఏటా 40 వేలకు పైగా దరఖాస్తులు వస్తే 4040 మందికి సీట్లు లభిస్తాయి. వీరిలో 97 శాతంపైగా ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులైనా పేదింటి విద్యార్థులే ఉంటారు.
ప్రభుత్వ.. ప్రైవేటు తేడా లేదు!
విద్యార్థులను ఫీజుల కోసం పీడించే గుణంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు తేడా ఉన్నట్లు కనిపించట్లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపార ధోరణిలో చూస్తూ కళాశాలలను నడిపిస్తున్నాయి. అయితే రెండేళ్లుగా ఫీజు బకాయిల దెబ్బకు తీవ్ర అప్పులు, అప్పులకు వడ్డీల భారంతో కుదేలయ్యాయి. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక రోజువారీ కళాశాల నిర్వహణకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా అప్పులపై నెట్టుకొస్తున్నాయి. గత్యంతరం లేని స్థితిలో విద్యార్థుల నుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇక 19 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోనూ ఇదే తీరు కనిపిస్తుండటం విచారకరం. విద్యార్థి చివరి ఏడాది చదువు ముగించుకుని సర్టిఫికెట్లతో బయటకు వెళ్లాలంటే ఫీజు బకాయిలు మొత్తం కట్టాల్సిన దుస్థితి దాపురించింది. ఇక్కడ డిగ్రీ, ఇంజనీరింగ్ నుంచి పీజీ కోర్సులకు వెళ్లే వారికి గడిచిన రెండేళ్లుగా సర్టిఫికెట్లు ఇవ్వక పోవడంతో ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కౌన్సెలింగ్ను సైతం వాయిదా వేసిన పరిస్థితులున్నాయి.
మూడో ఏడాది హామీ గాలికే!
చంద్రబాబు ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ప్రైవేటు కళాశాలల్లో పీజీ చేసే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. తీరా, అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడోసారి మోసం చేసింది. త్వరలో పీజీ కౌన్సెలింగ్ చేపట్టనుండగా, ప్రైవేటులో ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై మాత్రం నోరు మెదపట్లేదు. ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేసే దిశగా వాటిల్లో పీజీ విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు బీరాలు పలికి ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ పీజీకి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తీరా చూస్తే.. ప్రైవేటు మాట దేవుడెరుగు.. ప్రభుత్వ వర్సిటీల్లోనే ఫీజులు కట్టకుంటే చదువుకునే పరిస్థితి లేకుండా పోయింది.
ప్రభుత్వ వర్సిటీల నిధులు దారి మళ్లింపు!
చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని భ్రష్టు పట్టించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో కరోనాను ఎదురించి సమర్థవంతంగా ఐదేళ్లు పథకాన్ని కొనసాగిస్తే.. చంద్రబాబు పాలనలో ఫీజుల పేరుతో విద్యార్థుల గొంతు నులిమేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో అత్యంత పారదర్శకంగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ చేసే విధానానికి స్వస్తి పలికి కళాశాలల ఖాతాల్లో నేరుగా వేస్తామని నమ్మబలికి ప్రైవేటు యాజమాన్యాలను సర్వం ముంచేశారు. పైగా షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి నిధుల చెల్లింపులను అడ్డుకుని ఏడాదికి రెండుసార్లు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారు. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేకపోవడంతో ప్రభుత్వ వర్సిటీలు, ఉన్నత విద్యా మండలి నుంచి దాదాపు రూ.1,200 కోట్లు నిధులు దారి మళ్లించి వాటితో ప్రైవేటు యాజమాన్యాలకు అరకొరగా విదిల్చారు. అదే, ప్రభుత్వ వర్సిటీల్లోనూ విద్యార్థులను ఫీజుల కోసం ఒత్తిడి చేస్తుండటం గమనార్హం. మరోవైపు ఉన్నత విద్యా మండలి ఖజానా నుంచి రూ.10 కోట్ల వరకు ప్రభుత్వం వాడేసుకోవడం గమనార్హం. ఇందులో ముఖ్యంగా చిన్నబాబు ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా ఏకంగా రూ.3.60 కోట్లు ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డుకు దారి మళ్లించేశారు.
విద్యకు అరకొర బడ్జెట్..
ఉన్నత విద్యను నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు సర్కార్ అరకొర బడ్జెట్తో ఆరి్థకంగా ముంచేస్తోంది. ప్రతి విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వెచ్చించాలి. కానీ, 2025–26 బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లు, 2026–27లో రూ.2,766 కోట్లు మాత్రమే కేటాయింపులు చూపించింది. ఈ ఏడాది భారీగా పేరుకుపోయిన బకాయిలను తీర్చడానికి బడ్జెట్ కేటాయింపులను పెంచాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మరోవైపు వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లించడంతో పాటు పాత చంద్రబాబు ప్రభుత్వంలోని రూ.1,778 కోట్లు బకాయిలను తీర్చింది. జగనన్న వసతి దీవెన కింద రూ.4,275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేసింది. ఇలా మొత్తం ఐదేళ్లలో ఉచిత ఉన్నత విద్యపై రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. కానీ, ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ఫీజు బకాయిల చెల్లింపులను సైతం చంద్రబాబు సర్కార్ విడుదల చేయడంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం.


