breaking news
RJUKT
-
ఫీజు కడితేనే సర్టిఫికెట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను చంద్రబాబు సర్కార్ దివాలా తీయిస్తోంది. పేదింటి విద్యార్థులకు ఉచిత విద్యను దూరం చేస్తూ పైశాచిక పాలన సాగిస్తోంది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోయినా, చీమకుట్టినట్టుగా కూడా లేకుండా దగాకోరుతనం ప్రవర్తిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల మెడపై కత్తి పెట్టి ఫీజులు వసూలు చేస్తుంటే కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. ఫీజు బకాయిలు చెల్లిస్తే తప్ప, సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ సంస్థలుగా సేవలందిస్తున్న విశ్వవిద్యాలయాలు సైతం మరో అడుగు ముందుకేసి ఫీజు బకాయిలకు సంబంధించి వంద రూపాయల బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు తీసుకోవడం విస్తుగొలుపుతోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాబూలి వ్యాపారి కంటే ఘోరంగా ఏపీలోని విద్యా సంస్థలు పేదింటి విద్యార్థులను ఫీజుల కోసం పీడిస్తుండటం దిగజారిన విద్యా దుస్థితికి అద్దం పడుతోంది. వాస్తవానికి పాత బకాయిలతో పాటు 2026–27 విద్యా సంవత్సరంలో చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీల కింద రూ.10,300 కోట్లు ఖర్చు చేయాలి. కానీ, బడ్జెట్లో మాత్రం రూ.2,766 కోట్లు మాత్రమే చూపించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటిదాక ఇచ్చింది రూ.2,800 కోట్లు మాత్రమే. ఫలితంగా ఇంకా రూ.6,400 కోట్లు బకాయి ఉంది. దీనిని గమనించిన విద్యా, ఆరి్థక వేత్తలు నెమ్మదిగా ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ సంపూర్ణంగా ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. ఫీజులు విద్యార్థులే కట్టాలంటూ వంద రూపాయల స్టాంప్ పేపర్పై సంతకాలు తీసుకున్న ఆర్జీయూకేటీ రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు కట్టాల్సిందే 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. అంతకు ముందు మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో పేదింటి విద్యార్థుల భవిష్యత్తుకు జీవం పోశారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గాలికి వదిలేసింది. ఫలితంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు సైతం ప్రభుత్వంపై నమ్మకం లేదని, అసలు ఫీజు డబ్బులు విడుదల చేసే పరిస్థితి లేదని అభిప్రాయానికి వచ్చాయి. దీంతో విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో ఫీజుల పీడింపులు, వేధింపులు పెచ్చుమీరాయి. ఈనెల 27న స్నాతకోత్సవం అని ప్రకటించిన వర్సిటీ యాజమాన్యం.. ఇంజనీరింగ్ పట్టా పొందాలంటే ఫీజు బకాయిలు మొత్తం ఒకేసారి కట్టాలని షరతు విధించడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. 2024, 2025లో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ ప్రదానం చేయాలంటే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెండింగ్ ఫీజులను కట్టాల్సిందేనని హుకుం జారీ చేసింది. లేదంటే ఫీజు బకాయి ఉన్నట్లు వంద రూపాయిల బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు తీసుకుంటోంది. ఈ వ్యవహారం భారీగా దుమారం రేపుతోంది. ఇలా నాలుగు బ్యాచుల్లో 16 వేల మందికిపైగా విద్యార్థుల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్లు అవసరమైతే అప్పులు చేసి రూ.లక్షల్లో ఫీజులు చెల్లించడం ఆర్జీయూకేటీలో పరిపాటిగా మారింది. ఫీజులు విద్యార్థులే కట్టాలంటూ వంద రూపాయల స్టాంప్ పేపర్పై సంతకాలు తీసుకున్న ఆర్జీయూకేటీ 97 శాతానికిపైగా పేదింటి విద్యార్థులే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదింటి విద్యార్థులు ఉన్నత స్థాయి సాంకేతిక విద్యను అందుకోవాలని మహానేత వైఎస్సార్ ఉమ్మడి ఏపీలో ఆర్జీయూకేటీ కింద ట్రిపుల్ ఐటీలను ప్రవేశపెట్టారు. 10వ తరగతి తర్వాత నేరుగా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ను అభ్యసించేలా ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చారు. రెండు సంవత్సరాల ప్రీ–యూనివర్సిటీ కోర్సు(పీయూసీ), 4 సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీగా బోధన సాగిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులకు ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు రెసిడెన్షియల్ క్యాంపస్లలో చదువు నేర్పించేలా మహోన్నత ఆశయంతో ఆర్జీయూకేటీని స్థాపించారు. ఇందులో ఏటా 40 వేలకు పైగా దరఖాస్తులు వస్తే 4040 మందికి సీట్లు లభిస్తాయి. వీరిలో 97 శాతంపైగా ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులైనా పేదింటి విద్యార్థులే ఉంటారు. ప్రభుత్వ.. ప్రైవేటు తేడా లేదు! విద్యార్థులను ఫీజుల కోసం పీడించే గుణంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు తేడా ఉన్నట్లు కనిపించట్లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపార ధోరణిలో చూస్తూ కళాశాలలను నడిపిస్తున్నాయి. అయితే రెండేళ్లుగా ఫీజు బకాయిల దెబ్బకు తీవ్ర అప్పులు, అప్పులకు వడ్డీల భారంతో కుదేలయ్యాయి. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక రోజువారీ కళాశాల నిర్వహణకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా అప్పులపై నెట్టుకొస్తున్నాయి. గత్యంతరం లేని స్థితిలో విద్యార్థుల నుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇక 19 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోనూ ఇదే తీరు కనిపిస్తుండటం విచారకరం. విద్యార్థి చివరి ఏడాది చదువు ముగించుకుని సర్టిఫికెట్లతో బయటకు వెళ్లాలంటే ఫీజు బకాయిలు మొత్తం కట్టాల్సిన దుస్థితి దాపురించింది. ఇక్కడ డిగ్రీ, ఇంజనీరింగ్ నుంచి పీజీ కోర్సులకు వెళ్లే వారికి గడిచిన రెండేళ్లుగా సర్టిఫికెట్లు ఇవ్వక పోవడంతో ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కౌన్సెలింగ్ను సైతం వాయిదా వేసిన పరిస్థితులున్నాయి. మూడో ఏడాది హామీ గాలికే! చంద్రబాబు ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ప్రైవేటు కళాశాలల్లో పీజీ చేసే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. తీరా, అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడోసారి మోసం చేసింది. త్వరలో పీజీ కౌన్సెలింగ్ చేపట్టనుండగా, ప్రైవేటులో ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై మాత్రం నోరు మెదపట్లేదు. ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేసే దిశగా వాటిల్లో పీజీ విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు బీరాలు పలికి ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ పీజీకి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తీరా చూస్తే.. ప్రైవేటు మాట దేవుడెరుగు.. ప్రభుత్వ వర్సిటీల్లోనే ఫీజులు కట్టకుంటే చదువుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ వర్సిటీల నిధులు దారి మళ్లింపు!చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని భ్రష్టు పట్టించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో కరోనాను ఎదురించి సమర్థవంతంగా ఐదేళ్లు పథకాన్ని కొనసాగిస్తే.. చంద్రబాబు పాలనలో ఫీజుల పేరుతో విద్యార్థుల గొంతు నులిమేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో అత్యంత పారదర్శకంగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ చేసే విధానానికి స్వస్తి పలికి కళాశాలల ఖాతాల్లో నేరుగా వేస్తామని నమ్మబలికి ప్రైవేటు యాజమాన్యాలను సర్వం ముంచేశారు. పైగా షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి నిధుల చెల్లింపులను అడ్డుకుని ఏడాదికి రెండుసార్లు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారు. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేకపోవడంతో ప్రభుత్వ వర్సిటీలు, ఉన్నత విద్యా మండలి నుంచి దాదాపు రూ.1,200 కోట్లు నిధులు దారి మళ్లించి వాటితో ప్రైవేటు యాజమాన్యాలకు అరకొరగా విదిల్చారు. అదే, ప్రభుత్వ వర్సిటీల్లోనూ విద్యార్థులను ఫీజుల కోసం ఒత్తిడి చేస్తుండటం గమనార్హం. మరోవైపు ఉన్నత విద్యా మండలి ఖజానా నుంచి రూ.10 కోట్ల వరకు ప్రభుత్వం వాడేసుకోవడం గమనార్హం. ఇందులో ముఖ్యంగా చిన్నబాబు ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా ఏకంగా రూ.3.60 కోట్లు ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డుకు దారి మళ్లించేశారు. విద్యకు అరకొర బడ్జెట్..ఉన్నత విద్యను నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు సర్కార్ అరకొర బడ్జెట్తో ఆరి్థకంగా ముంచేస్తోంది. ప్రతి విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వెచ్చించాలి. కానీ, 2025–26 బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లు, 2026–27లో రూ.2,766 కోట్లు మాత్రమే కేటాయింపులు చూపించింది. ఈ ఏడాది భారీగా పేరుకుపోయిన బకాయిలను తీర్చడానికి బడ్జెట్ కేటాయింపులను పెంచాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మరోవైపు వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లించడంతో పాటు పాత చంద్రబాబు ప్రభుత్వంలోని రూ.1,778 కోట్లు బకాయిలను తీర్చింది. జగనన్న వసతి దీవెన కింద రూ.4,275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేసింది. ఇలా మొత్తం ఐదేళ్లలో ఉచిత ఉన్నత విద్యపై రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. కానీ, ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ఫీజు బకాయిల చెల్లింపులను సైతం చంద్రబాబు సర్కార్ విడుదల చేయడంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. -
టాప్లో ప్రకాశం.. మొత్తం ర్యాంకుల్లో శ్రీకాకుళం
సాక్షి, అమరావతి: ఆర్జీయూకేటీ సెట్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10,389 ర్యాంకులు సాధించగా.. ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు 9,611 ర్యాంకులు వచ్చాయి. 1 నుంచి 5వేల వరకు ర్యాంకుల్లో ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. మొత్తంగా చూస్తే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే అత్యధిక ర్యాంకులను సొంతం చేసుకున్నారు. ఈ ఫలితాల్లో ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. 1–1,000 ర్యాంకుల్లో 116 ర్యాంకులతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. 92 ర్యాంకులతో ద్వితీయ స్థానంలో వైఎస్సార్ జిల్లా నిలిచింది. మొత్తం 20 వేల ర్యాంకుల్లో అత్యధికంగా 1,888 ర్యాంకులతో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. 1,793 ర్యాంకులతో వైఎస్సార్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. అత్యధికంగా 11,677 మంది వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఓసీలు 3,725 మంది, ఎస్సీలు 1,889 మంది, ఎస్టీలు 363 మంది ఎంపికయ్యారు. వీరు కాకుండా ఈడబ్ల్యూఎస్ కోటా కిందికి వచ్చే విద్యార్థులు 2,346 మంది ఉన్నారు. -
ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థుల హవా
ఒంగోలు మెట్రో: రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జేయూకేటీ) సెట్– 2021 పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. తొలి ఆరు ర్యాంకులు వారే సొంతం చేసుకున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఆర్జేయూకేటీ వైస్ చాన్సలర్ కేసీ రెడ్డి నేతృత్వంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సురేష్, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీల్లో ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఆగస్టు 18న నోటిఫికేషన్ వెలువరించి, సెప్టెంబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించారు. పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 73,548 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలో 470, తెలంగాణలో 8 కేంద్రాల్లో పరీక్షను సెప్టెంబర్ 26న నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 71,207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా, నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మొత్తం 4400 సీట్లు ఉండగా, ఒక్కో సీటుకు 18 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. పరీక్ష నిర్వహించిన పది రోజుల్లోనే పరీక్షల ఫలితాలు విడుదల చేసి అధికారులు రికార్డు సృష్టించారు. త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు. ఆటోమొబైల్ ఇంజనీర్ కావడమే లక్ష్యం రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలోని కళాశాలలో చదవాలనుకుంటున్నా. ఆటోమొబైల్ ఇంజనీర్ కావడమే నా ముందున్న లక్ష్యం. – మద్దన గుణశేఖర్, 1వ ర్యాంక్ కలెక్టర్గా చూడాలని అమ్మానాన్న కోరిక 2వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. మాది వ్యవసాయ కుటుంబం. నన్ను కలెక్టర్గా చూడాలన్నది అమ్మనాన్న కోరిక. వారి కలను సాకారం చేసే దిశగా లక్ష్యం వైపు అడుగులు వేస్తా. – కూశెట్టి శ్రీచక్రధరణి, 2వ ర్యాంక్ ఇంజనీరింగ్ చేస్తూ సివిల్స్కు సిద్ధమవుతా ఇంజనీరింగ్ (సీఈసీ) చదువుతూ సివిల్స్కు సిద్ధమవుతా. తండ్రి చనిపోయారు. తల్లి విభిన్న ప్రతిభావంతురాలు. తాతయ్యతో పాటు చిన్నాన్న మురళీ, మామయ్య కృష్ణారావులు చదువులో మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇష్టంగా చదవడంతోనే పదో తరగతిలో 10/10 పాయింట్లు సాధించా. ఆర్జీయూకేటీ సెట్–21లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. – మన్నెపూరి చంద్రిక, 3వ ర్యాంకు -
ట్రిపుల్ ఐటీ ద్వితీయ స్నాతకోత్సవానికి సన్నాహాలు
వేంపల్లె : ఇడుపులపాయలోని ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ ద్వితీయ స్నాతకోత్సవాన్ని జనవరి 4వ తేదీన నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆచార్య గొడవర్తి భగవన్నారాయణ తెలియజేశారు. స్నాతకోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. గౌరవ అతిథులుగా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య రాజ్రెడ్డి, ఉప కులపతి ఆచార్య రామచంద్రరాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారని చెప్పారు. గతనెల రోజుల నుంచి స్నాతకోత్సవ సమీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం కూడా అధికారులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు కేటాయించిన పనులపై సమీక్ష చేశారు. స్టేజీ నిర్మాణం, వచ్చిన అతిథులకు భోజన సౌకర్యం, విలేకరులకు ఆహ్వానం, తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలు, మెడల్స్ తయారీ, ఇతరత్రా ఆహ్వాన పత్రికలతోపాటు స్నాతకోత్సవ బ్యానర్లువంటి అంశాలను పరిపాలన అధికారి అమరేంద్ర కుమార్ పండ్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్నాతకోత్సవ సమీక్షలో డైరెక్టర్ భగవన్నారాయణతోపాటు ఒంగోలు డైరెక్టర్ విశ్వనాథరెడ్డి, పరిపాలన అధికారి అమరేంద్ర పండ్ర, విద్యా సంరక్షణ అధికారి కొండారెడ్డి, ఆర్థిక అధికారి మోహన్ కృష్ణ, రత్నకుమారి, కెఎల్ఎన్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, నరసప్ప, అజీజ్, లక్ష్మణ్, ఎంఎన్ బ్రహ్మానందయ్య తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీలకు నేటి నుంచి దరఖాస్తులు
నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్జీయూకేటీ బాసరలో వేరుగా, ఇడుపులపాయ, నూజివీడుల్లో వేరుగా ప్రవేశాలు బాసరలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే.. మిగతా రెండింటిలో 85 శాతం సీట్లు ఏపీ వారికే సాక్షి, హైదరాబాద్: రాజీవ్గాంధీ విద్యా వైజ్ఞానిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని మూడు ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. తెలంగాణలోని బాసర ట్రిపుల్ఐటీకి వేరుగా, ఏపీలోని నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలకు కలిపి వేరుగా ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ సత్యనారాయణ సోమవారం నోటిఫికేషన్లు జారీ చేశారు. ఒక్కో ట్రిపుల్ఐటీలో 1000 సీట్ల చొప్పున 3వేల సీట్లను భర్తీ చేయనున్నారు. ఇరు రాష్ట్రాల్లో ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మంగళవారం నుంచి వచ్చే నెల 19వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలలల్లో టెన్త్ చదివిన విద్యార్థులకు 0.4 జీపీఏను అదనంగా కలిపి మెరిట్ను నిర్ధారిస్తారు. 85 శాతం సీట్లు స్థానికులకే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో గతంలోలా (32:42:26 రేషియో) కాకుండా ఈసారి 371(డి) ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు. అంటే బాసర ట్రిపుల్ఐటీలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారు. మిగతా 15 శాతం ఓపెన్కోటాలో ఇరు రాష్ట్రాల విద్యార్థులకు అవకాశమిస్తారు. ఇక ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ఐటీల్లో 85 శాతం సీట్లను ఏపీ విద్యార్థులకు.. మిగతా 15 శాతం చొప్పున ఓపెన్ కోటాలో ఇరు రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, బీసీ విద్యార్థులు రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లిం చాలి. ఇక రిజిస్ట్రేషన్ ఫీజు, వార్షిక ఫీజులకు సంబంధించిన వివరాలను ఆర్జీయూకేటీ వెబ్సైట్లో పొందవచ్చు. ఫీజు రీయింబర్స్మెంట్ మార్గదర్శకాలను వేరుగా ఇస్తారు. ప్రవేశాల ప్రక్రియ వివరాలు.. జూన్ 19: ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ జూలై 8: కౌన్సెలింగ్ కోసం ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన 20న: స్పెషల్ కేటగిరీ కౌన్సెలింగ్ (తెలంగాణకు బాసరలో, ఏపీ వారికి నూజివీడులో) 22, 23 తేదీల్లో: సాధారణ కౌన్సెలింగ్ (తెలంగాణ వారికి బాసరలో, ఏపీ వారికి నూజివీడులో) 27న: మిగిలిన ఖాళీల భర్తీ కోసం వెయిటింగ్ జాబితాలో ఉన్న వారికి కౌన్సెలింగ్ (మూడు ట్రిపుల్ ఐటీల్లో) 30న: ఓరియంటేషన్ తరగతులు ఆగస్టు 1: తరగతులు ప్రారంభం చైతన్యం కల్పిస్తున్నాం: వీసీ ట్రిపుల్ఐటీల్లో చేరిన తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లిష్ సరిగా రాని కారణంగా మనస్థాపానికి గురవడం, ఆత్మహత్యలకు పాల్పడడం వంటివి చేస్తున్న నేపథ్యంలో... వారిలో చైతన్యానికి కృషి చేస్తున్నామని ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ సత్యనారాయణ సోమవారం తెలిపారు. మొదటి ఏడాది నుంచే తప్పనిసరిగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఐటీ పరిజ్ఞానం, పర్సనాలిటీ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్ వంటి అంశాలపై తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. -
ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని బాసర, ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. 3 వేల మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించే నోటిఫికేషన్ ను ఆర్జేయూకేటీ వైస్ ఛాన్సలర్ రాజ్ కుమార్ విడుదల చేశారు. జూన్ నెల 21 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుందని, జూన్ 16 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని ఓ ప్రకటనలో వెల్లడించారు. జూలై 8న విద్యార్థుల ఎంపిక, జూలై 23, 24 కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. జూలై 28న తరగతులు ప్రారంభిస్తామని వీసీ ఓ ప్రకటనలో తెలిపారు. -
ట్రిపుల్ ఐటీ సిబ్బంది నియామకాల్లో తప్పిదాలు!
సాక్షి, హైదరాబాద్: రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల వ్యవహారంలో తప్పిదాలు జరిగినట్లు విచారణ కమిటీ నిర్ధారణకు వచ్చింది. లెక్చరర్ పోస్టులను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా ప్రభుత్వం మార్పు చేయకున్నా.. వాటిని కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే ప్రకటించి భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. పోస్టులకు అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లకు తూట్లు పొడిచినట్లు విచారణ కమిటీ పేర్కొంది. ఇంటర్వ్యూ మార్కులను కేటాయించిన తరువాత వాటిని దిద్ది తప్పిదాలకు పాల్పడినట్లు ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది. గత ఏడాది చేపట్టిన 246 పోస్టుల భర్తీ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం కల్పించుకొని ఇంటర్వ్యూలు పూర్తయిన వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా నిలిపివేసింది. అవకతవకలపై గత ఏడాది అక్టోబరు 26న విచారణకు ఆదేశించింది. మాజీ వైస్ ఛాన్స్లర్లు సీఆర్ విశ్వేశ్వరరావు, తిరుమలరావు, ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ విజయప్రకాష్లతో కూడిన కమిటీ పోస్టుల భర్తీ వ్యవహారంపై విచారణ జరిపి ఫిబ్రవరి మొదటివారంలో నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదికలో పేర్కొన్న పలు తప్పిదాలు ఆర్జీయూకేటీలో ఆధ్వర్యంలోని మూడు ట్రిపుల్ ఐటీల్లో బోధన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టింది. అందులో 118 అసిస్టెంట్ ప్రొఫెసర్, 118 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. ఈ రెండు కేటగిరీల పోస్టులకు వేతనాలు ఒకటైనా సర్వీసు రూల్స్ వేరు. దీంతో ఆ 118 లెక్చరర్ పోస్టులను కూ డా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మార్పు చేయమని (కన్వర్ట్) ప్రభుత్వానికి రాసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకముందే వాటిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూలు పూర్తి చేసింది. ఇంటర్వ్యూల్లో మార్కులు వేసిన తరువాత 90 శాతం అభ్యర్థులకు మార్కుల షీట్ల విషయంలో తప్పులు జరిగాయి. మొదట వేసిన మార్కులను తరువాత దిద్దారు. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులో ఓసీ మహిళకు వచ్చిన మార్కుల ప్రకారం ఆమె ఓసీ జనరల్ కేటగిరీలో ఎంపిక చేయాలి. కాని ఆమెను ఓసీ మహిళ కేటగిరీలో ఎంపిక చేశారు. ఒక ఎస్సీ అభ్యర్థి విషయంలోనూ అలాగే చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్లోనూ ఓసీ మహిళను మెరిట్ ప్రకారం ఓసీ జనరల్లో ఎంపిక చేయాల్సి ఉండగా, ఓసీ మహిళ కేటగిరీలో ఎంపిక చేశారు. ఓసీ జనరల్లో ఎంపిక చేయాల్సిన బీసీ-డీ అభ్యర్థిని రిజర్వేషన్లో ఎంపిక చేశారు. ఈఈఈ సబ్జెక్టులోనూ ఓసీ మహిళ విషయంలో అలాగే చేశారు. రోస్టర్ పాయింట్స్లో తేడాలు చూపారు. ఈసీఈలో ఓసీ జనరల్లో ఎంపిక చేయాల్సిన ఎస్సీ అభ్యర్థిని రిజర్వేషన్లో ఎంపిక చేశారు. పోస్టు కోసం కడపలోని ఆర్కే వ్యాలీ అప్షన్ ఇవ్వకపోయినా ఒకరిని అక్కడి పోస్టింగ్ జాబితాలో చేర్చారు.


