
కడప కార్పొరేషన్: ప్రాజెక్టుల సందర్శన పేరుతో చంద్రబాబు ఆద్యంతం హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా విమర్శించారు. ఆదివారం ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో బరితెగించిన చంద్రబాబు మాటలు, ఉచ్ఛ నీచాలు మరిచి చేసిన వ్యాఖ్యలు ఆయన ఉద్దేశాన్ని చెప్పకనే చెబుతున్నాయన్నారు. అడ్డూ అదుపు లేకుండా కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు, గలాటాలు, అల్లర్లు రేపి విధ్వంసం సృష్టించాలన్నదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అని పేర్కొన్నారు.
సీఎం వైఎస్ జగన్పై, ఆయన కుటుంబంపై కొన్ని రోజులుగా సంస్కారహీనంగా, బజారు మనిషిలాగా బాబు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు రెచ్చగొడుతూ చేసిన కామెంట్లతోనే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. పోలీసులు ఎంత చెప్పినా టీడీపీ కార్యకర్తలు వినకుండా కేకలు వేస్తూ, తొడలు చరుస్తూ కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లు విసురుతూ దాడులకు తెగబడ్డారన్నారు. ఈ దాడిలో పలువురు పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడటం దారుణమన్నారు. వాహనాలను తగులబెట్టి పోలీసులను గాయపరచడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. అంతిమంగా చంద్రబాబుకు కావాల్సింది మారణ హోమమేనని, 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇంత రాక్షసత్వానికి పాల్పడటం దారుణమని, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలని అంజద్బాషా డిమాండ్ చేశారు.