YSRCP: సరికొత్త సామాజిక విప్లవం..  | Sakshi
Sakshi News home page

YSRCP: సరికొత్త సామాజిక విప్లవం.. 

Published Sat, Feb 3 2024 1:33 PM

CM YS Jagan Key Decisions Over YSRCP Candidates In AP - Sakshi

ఏపార్టీ అయినా కానీ బాసూ.. అక్కడ మాత్రం ఆ కులానికే సీట్ ఇవ్వాలి.. ఎవరేమనుకున్నా కానీ ఈ ఎంపీ, ఎమ్మెల్యే సీట్ మాత్రం వాళ్ళకే ఇస్తారు. అయినా కోట్లు లేకుండా టిక్కట్ ఎలా దక్కుతుంది గురూ.. డబ్బుల్లేకుండా ఎలా గెలుస్తారు? ఇవీ గత కొన్నేళ్ళక్రితం వరకూ ప్రజల్లో ఉన్న అభిప్రాయం..

 కానీ, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్తగా సామాజిక విప్లవానికి నాంది పలికారు. ఇన్నాళ్లూ ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్‌ సీట్లు పోగా మిగిలిన జనరల్ సీట్లలో ఆ ఎంపీ సీటు ఆ కులానిది.. ఈ ఎమ్మెల్యే సీటు ఆ వర్గానిది అంటూ అనధికారిక రిజర్వేషన్లు ఉండేవి.  అంటే ఆ ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు ఏ పార్టీ వాళ్ళయినా ఫలానా కులానికి ఇవ్వాలన్నది ఒక అలిఖిత నిబంధన.. కొనసాగుతూ వస్తోంది. కానీ, సీఎం జగన్‌ ఆ నిబంధనల సంకెళ్లు తెంచేసి.. ఎస్సీ, ఎస్టీ సీట్లు మినహా మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సరికొత్త ఫార్ములాను రూపొందించారు. అగ్రకులాలు అంటే రెడ్డి, కమ్మ.. కాపు.. క్షత్రియ నాయకులు ఏలిన స్థానాల్లో సైతం ఇప్పుడు బీసీ అభ్యర్థులకు స్థానం కల్పిస్తూ సరికొత్త సామజిక విప్లవానికి ముఖ్యమంత్రి జగన్‌ బీజం వేశారు. 

నెల్లూరు సిటీ స్థానాన్ని గతంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా ముస్లింలకు ఇవ్వడం ద్వారా.. అక్కడ ఆ వర్గాన్ని దగ్గర చేసుకున్నారు. నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం మొదటి నుంచీ క్షత్రియులు లేదా కాపులకు రిజర్వ్ చేయబడిన సెగ్మెంట్. కృష్ణంరాజు.. చేగొండి హరిరామజోగయ్య.. భూపతిరాజు విజయకుమార్ రాజు వంటి పెద్ద నాయకులు ఎంపీగా గెలిచిన చోటు అది.  దానికితోడు భారీగా ఖర్చు కూడా పెట్టగలిగే వాళ్ళు అక్కడ పోటీ చేస్తారు. ఆ ప్రాంతానికి ఉన్న పొటెన్సీ అలాంటిది. అలాంటి నర్సాపురం ఎంపీగా బీసీ శెట్టిబలిజ కులానికి చెందిన సాధారణ అడ్వకేట్‌ ఉమాబాలకు కేటాయించి సీఎం జగన్‌ ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ఏలూరు.. కాకినాడ.. శ్రీకాకుళం.. విజయనగరం.. నర్సరావుపేట, అనంతపురం.. హిందూపురం.. కర్నూల్.. విశాఖ వంటి ఎంపీ స్థానాలు బీసీలకు కేటాయించారు.

తద్వారా ఆయా నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఓటర్లుగానే ఉంటూ వస్తున్నా కులాలకు నాయకత్వాన్ని అప్పగించే సరికొత్త విధానానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ బాటలు వేస్తున్నారు. అయితే, ఈ నిర్ణయాల పట్ల కొందరు పుల్లవిరుపు మాటలు, వ్యంగ్యపు కామెంట్లు చేస్తున్నారు.

అనామకులనుకున్నవాళ్ళే అసామాన్యులయ్యారు..
వీళ్ళు ఎంపీలా?,  వీళ్ళు ఎమ్మెల్యేల అంటూ అప్పట్లో చాలామంది మీద ఇలాంటి కామెంట్స్‌ వినిపించాయి. కానీ, ఆ ఫలితాలు చూసాక వాళ్ళే వారెవ్వా ఇదీ జగనన్న స్కెచ్‌ అన్నారు.. ఉదాహరణకు.. 

# పార్వతీపురం(ఎస్టీ) నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రిగా చేసిన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తపల్లి గీత, గొట్టేటి మాధవి అనే సాధారణ కార్యకర్తల చేతిలో రెండు సార్లు ఓడిపోయారు

# కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనే సీనియర్ నేత అనామకుడైన సంజీవ్ కుమార్ చేతిలో ఓడిపోయారు

# రాయపాటి సాంబశివరావు అనే సీనియర్ నాయకుడు.. లావు కృష్ణదేవరాయలు అనే యువకుడి చేతిలో గుంటూరులో ఓటమి చవిచూశారు 

# సినీ నటుడు.. డబ్బున్న నాయకుడు అయినా మురళీమోహన్ కోడలు మాగంటి రూప కాస్తా రాజమండ్రిలో కొత్తవాడైన మార్గాని భరత్ చేతిలో ఓడిపోయారు.

# విజయనగరం రాజకుటుంబీకుడు పలుమార్లు రాష్ట్ర.. కేంద్ర మంత్రిగా చేసిన అశోక్ గజపతిరాజు కాస్తా కొత్తవాడైన బెల్లాన చంద్రశేఖర్ చేతిలో మట్టి కరిచారు.

ఇలా చూసుకుంటూ పొతే జగనన్న వేసిన ప్లాన్ ఎంతోమంది సాధారణ కార్యకర్తలను రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులుగా మార్చింది.

-సిమ్మాదిరప్పన్న

Advertisement
Advertisement