'దొరికారు దొంగలు'  ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ  | Sakshi
Sakshi News home page

'దొరికారు దొంగలు'  ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ 

Published Fri, Feb 9 2024 1:58 AM

CID in IRR scam case Chandrababu A1 Narayana A2 Land Scam - Sakshi

సాక్షి, అమరావతి:  టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై సీఐడీ దూకుడు పెంచింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొంది. లింగమనేని కుటుంబంతో కలిసి సాగించిన ఈ క్విడ్‌ ప్రో కో కుంభకోణంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన నారా లోకేశ్‌ను ఏ–14గా, లింగమనేని రమేశ్‌ తదితరులను కూడా నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(2), రెడ్‌విత్‌ 13(1)(సి),(డి)ల ప్రకారం వారిపై కేసు నమోదు చేసినట్టు ఆ చార్జ్‌షీట్‌లో వెల్లడించింది.

తద్వారా ఈ భారీ భూ కుంభకోణంపై న్యాయ విచారణ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. కాగితాల మీదే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో ఇష్టానుసారం మార్పులు చేసి, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతి బాగోతం విభ్రాంతి పరుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్‌డీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్‌ చైర్మన్‌గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి ఇలా అవినీతికి పాల్పడ్డారు. ఇందుకోసం లింగమనేని రమేశ్‌తో క్విడ్‌ ప్రో కో కు తెరలేపారు.

ఈ తతంగంలో నారా లోకేష్‌ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్‌ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌కు కూడా వాటా ఇవ్వడం గమనార్హం.  
 
సింగపూర్‌ కన్సల్టెన్సీ ముసుగు  
సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్‌ కన్సల్టెన్సీ ముసుగులో చంద్రబాబు ముఠా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ పేరిట భూ దోపిడీకి పాల్పడింది. సీఆర్‌డీయే ఏకంగా సింగపూర్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టుగా టీడీపీ ప్రభుత్వం భ్రమింపజేసింది. కానీ ఆ పేరుతో సింగపూర్‌లోని ప్రైవేట్‌ కన్సల్టెన్సీ సుర్బాన జ్యురాంగ్‌ కన్సల్టెన్సీని తీసుకువచ్చి పక్కాగా అవినీతి కథ నడిపించింది.

అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కోసం సీఆర్‌డీయే అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అలైన్‌మెంట్‌ రూపొందించారు. ఆ ప్రకారం అమరావతిలోని చంద్రబాబు, లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కిలోమీటర్ల దూరం నుంచి పెద్దమరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మించాలి.

దాంతో తమ భూముల విలువ పెరగదని గ్రహించిన చంద్రబాబు, నారాయణ.. సీఆర్‌డీయే అధికారులపై మండిపడ్డారు. వారిద్దరి ఆదేశాలతో సీఆర్‌డీయే అధికారులు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు. అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి.. తాడికొండ, కంతేరు, కాజాలలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్‌ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా ఖరారు చేశారు.

ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి.. చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్‌ సంస్థల పేరిట ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్‌ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు.

అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ డిజైన్‌ను అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్‌ ప్లాన్‌లో పొందు పరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారు. అంటే అప్పటికే సీఆర్‌డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. 
 
ఇదిగో అడ్డగోలు దోపిడీ ఇలా.. 
► ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ కుంభకోణం ద్వారా చంద్రబాబు ముఠా లింగమనేని కుటుంబంతో క్విడ్‌ ప్రో కోకు పాల్పడింది. లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా చంద్రబాబు తమ హెరిటేజ్‌ ఫుడ్స్‌కు భూములు పొందారు. ఈ ప్రక్రియలో అప్పటి హెరిటేజ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌ హోదాలో లోకేశ్‌ కీలక భూమిక పోషించారు. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను ఆనుకుని ఉన్న కంతేరు గ్రామంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందారు.  

► 2014 జూన్‌ – సెప్టెంబర్‌ మధ్య ఈ భూములను హెరిటేజ్‌ ఫుడ్స్‌ కొనుగోలు చేసినట్టు చూపించారు. అంతే కాకుండా లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట హెరిటేజ్‌ ఫుడ్స్‌ దక్కించుకుంది. కానీ అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్‌ డీడ్‌ను రద్దు చేసుకున్నారు. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్‌ ఫుడ్స్‌ భూములు ఉండటం గమనార్హం.  

► క్విడ్‌ ప్రో కో లో భాగంగా లింగమనేని రమేశ్‌ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారానికి మసి పూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్‌ చెప్పారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ, చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయ పన్ను వివరాల్లో లేవు. 

► తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి అప్పటి ప్రభుత్వం నుంచి చంద్రబాబు హెచ్‌ఆర్‌ఏ ఎందుకు పొందారని ప్రశ్నించేసరికి ఆయన వద్ద నుంచి జవాబే లేదు. దాంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్‌ ప్రో కో కింద ఇచ్చారన్నది స్పష్టమైంది. 
 
మ్యాప్‌ను చుట్టూ తిప్పేశారు.. 
► లింగమనేని కుటుంబంతో క్విడ్‌ ప్రో కో ద్వారా పొంగూరు నారాయణ.. తమ బంధువులు, బినామీల పేరిట 58 ఎకరాలు పొందారు. చంద్రబాబు, నారాయణ కుటుంబాలు అక్రమంగా దక్కించుకున్న భూముల సమీపంలోనే ప్రభుత్వ నిధులతో సీడ్‌ క్యాపిటల్‌ ఏరియా, స్టార్టప్‌ ఏరియాను అభివృద్ధి చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రణాళికను ఆమోదించింది. అందుకోసం ఏకంగా ప్రభుత్వ నిధులు రూ.5,500 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. తద్వారా తమ భూముల ధరలు అమాంతం పెరిగేలా చేసేందుకు కుట్ర పన్నింది.  

► సీఆర్‌డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్‌మెంట్‌ ప్రకారం గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించాలి. అక్కడి నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కొనసాగుతుంది. అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దాంతో నారాయణ ఆదేశాలతో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు.  

► ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం – కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మించాలని నిర్ణయించారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును నిర్మిస్తారు. దాంతో నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు.  
 
పవన్‌ కల్యాణ్‌కూ 2.40 ఎకరాల ప్యాకేజీ 
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కూడా ఈ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అవినీతి పాపంలో పిడికెడు వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్‌ పూలింగ్‌ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్‌ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం.  
 
రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు..  
► ఎత్తుగడల వల్ల చంద్రబాబు, లింగమనేని రమేశ్‌ కుటుంబాలకు చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉండేది. అంటే ఆ భూముల మార్కెట్‌ విలువ రూ.177.50 కోట్లుగా ఉండేది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ తర్వాత మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్‌ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగినట్టే.  

► ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్‌ ధర ప్రకారం హెరిటేజ్‌ ఫుడ్స్‌ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది.  

► క్విడ్‌ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్‌ క్యాపిటల్‌లో పొందిన 75,888 చదరపు గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ స్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. 
 
లోకేశ్‌ అరెస్ట్‌కు ప్రతిబంధకం కాదు 
ఐఆర్‌ఆర్‌ కేసులో సీఐడీ చార్జ్‌షీట్‌ దాఖలు ఇప్పటికే విచారణలో ఉన్న ‘రెడ్‌బుక్‌’ కేసును ప్రభావితం చేయదని నిపుణులు చెబుతున్నారు. రెడ్‌బుక్‌ కేసులో లోకేశ్‌ను అరెస్ట్‌ చేసేందుకు ఈ చార్జ్‌సీట్‌ ప్రతిబంధకం కాదు. ఐఆర్‌ఆర్‌ కేసులో అధికారులు, సాక్షులను బెదిరిస్తూ కేసు విచారణను ప్రభావితం చేసే రీతిలో రెడ్‌బుక్‌ పేరిట ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు.

దీంతో గతంలో ఇచ్చిన నోటీసులకు విరుద్ధంగా వ్యవహరించిన లోకేశ్‌ను అరెస్ట్‌ చేసేందుకు అనుమతించాలని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 13కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఐఆర్‌ఆర్‌ కుంభకోణం కేసు, రెడ్‌బుక్‌ బెదిరింపులు వేర్వేరు కేసులు. కాబట్టి ఐఆర్‌ఆర్‌ కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసినప్పటికీ రెడ్‌బుక్‌ పేరిట బెదిరింపు కేసులో లోకేశ్‌ను అరెస్ట్‌ చేసేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదని నిపుణులు స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement