ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పు

Change in the working hours of government offices in AP - Sakshi

కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం 8 నుంచి 11.30 వరకే ఓపెన్‌

అత్యవసర సేవల శాఖలకు ఈ పని వేళలు వర్తించవు

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాప్తి కట్టడే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పని వేళల్లో కూడా మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాధ్‌ దాస్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖలు, సచివాలయం, శాఖాధిపతులు, జిల్లా, సబ్‌ డివిజన్‌ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే పనిచేయాలని పేర్కొన్నారు.

మధ్యాహ్నం 12 గంటల తరువాత ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండాలంటే కచ్చితంగా ప్రత్యేక పాసులు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఆయా కార్యాలయాల అధిపతులు పని ఆధారంగా ఎంత మంది ఉద్యోగులు మధ్యాహ్నం 12 గంటల తరువాత ఉండాలో నిర్ణయించాలని సూచించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్‌ నియంత్రణలో పాల్గొంటున్న వైద్య ఆరోగ్య శాఖ, ఇంధన శాఖ, మునిసిపల్‌ పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖలకు ఈ పని వేళలు వర్తించవు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top