28న జరిగే రాష్ట్ర సదస్సుకు రండి
ఏపీ ఎన్జీఓ నేతలకు ఏపీ జేఏసీ అమరావతి నేతల ఆహ్వానం
సాక్షి, అమరావతి/ గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఉద్యోగుల సమస్యలపై కలిసి పోరాడదామని ఏపీ జేఏసీ అమరావతి నేతలు ఏపీ జేఏసీ నేతలను ఆహ్వానించారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో నాయకుల బృందం మంగళవారం విజయవాడలో ఏపీఎన్జీవో భవన్కి వెళ్లి ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణను కలిశారు.
ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం రెండేళ్లుగా స్పందించని నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈనెల 28న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని అందులో పాల్గొనాలని కోరారు. ఏ ప్రభుత్వమైనా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిగిన వెంటనే నిర్ణయాలు వెల్లడిస్తాయని, కానీ కూటమి ప్రభుత్వం గత నెల 22న చర్చలు జరిపి నెల రోజులు దాటినా ఎటువంటి నిర్ణయాలు ప్రకటించలేదని తెలిపారు.
ఇది చాలా బాధాకరమని అందుకే ఉద్యోగులంతా గతంలో మాదిరి రెండు జేఏసీలు కలిసి ఉద్యమం చేయాలని కోరుకుంటున్నారన్నారు. దీనిపై ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ స్పందిస్తూ తాము వచ్చే నెల 3న ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని, ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుని విషయం చెబుతామన్నారు. అలాగే, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణను 28న జరిగే రాష్ట్ర సదస్సుకు ఆహ్వానించారు.


