డేటా సెంటర్ నిర్మాణ పనులపై ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ
చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక
సాక్షి, అమరావతి: విశాఖపట్నం రూరల్ మండలం, అడవివరం గ్రామంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిలో ఏర్పాటు చేస్తున్న వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ విషయంలో చట్ట నిబంధనలను అనుసరించి తీరాల్సిందేనని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. పర్యావరణ పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టంచేసింది. పర్యావరణ అనుమతులు తీసుకుని చట్ట నిబంధనల మేరకే డేటా సెంటర్ నిర్మాణ పనులు కొనసాగించాలని తేల్చి చెప్పింది.
ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరిస్తూ, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవస్థానానికి చెందిన భూమిని డేటా సెంటర్ ఏర్పాటు నిమిత్తం ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ పర్యావరణవేత్త, జల్ బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై తాజాగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజ స్పందిస్తూ, డేటా సెంటర్ కోసం భూమిని కేవలం 11 ఏళ్ల లీజు ప్రాతిపదికన మాత్రమే కేటాయించామన్నారు. దీనివల్ల దేవస్థానానికి ఏటా రూ.26 కోట్ల మేర ఆదాయం వస్తుందన్నారు.


