తాడేపల్లి: జూనియర్ డాక్టర్ల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు వైఖరిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వాకం వల్ల వారు స్టైఫండ్ కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రాణాలు కాపాడే జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి.. పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడతారా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్.
‘చంద్రబాబూ… రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా మీరు ఎందుకు స్పందించడం లేదు?, నిబంధనల ప్రకారం జనవరి 1 నుంచి అమలుకావాల్సిన స్టైఫండ్ సవరణను ఎందుకు నిలిపివేశారు?, జూనియర్ డాక్టర్లకు జీవో నంబర్ 287 నిర్దేశించిన 15శాతం కంటే అధికంగా మా హయాంలో 42.4 శాతం పెంచాం. సూపర్ స్పెషాల్టీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్గా గురిస్తూ, వారి విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకుని నిర్దేశించిన దానికంటే పెంచి, మొత్తంగా 77శాతం వారికి పెంచాం.
ఆయుష్ విభాగానికి చెందిన జూనియర్ డాక్టర్లకు కూడా అల్లోపతి జూనియర్ డాక్టర్ల తరహాలోనే స్టైపెండ్ పెంచాం. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని 15 శాతం కంటే మెరుగైన పెంపు ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు కోరుతుంటే, కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడం అన్యాయం కాదా?, జూనియర్ డాక్టర్ల శ్రమతోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య సేవలు నడుస్తున్నాయి. ఇప్పుడు సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకూ అంతరాయం ఏర్పడి పేద రోగులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
ఈ పరిస్థితికి మీ ప్రభుత్వ మొండి వైఖరే కారణం కాదా చంద్రబాబు?, ఇప్పటికే మీరు పెట్టిన బకాయిలతో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. మరోవైపు ప్రభుత్వ వైద్యరంగాన్ని మీరు దారుణంగా దెబ్బతీశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మేం ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి, ఐదింటిని పూర్తిచేసి క్లాసులు కూడా ప్రారంభిస్తే, మరో కాలేజీని క్లాసులకు సిద్ధంచేసి, మొత్తంగా ఆరు అందుబాటులోకి తెచ్చాం. మిగిలిన వాటిని పూర్తిచేయాల్సిందిపోయి, వాటిని తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సరిపోక ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర ఆస్పత్రుల్లో మిగిలిన నాడు–నేడు పనులను మీరు నిలిపివేశారు.
WHO/GMP ప్రమాణాలు ఉండే మందులు లేక గవర్నమెంటు ఆస్పత్రులు విలవిల్లాడుతున్నాయి. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. వైద్యరంగంలో మేం నియమించిన 50 వేల మంది సిబ్బందిని క్రమంగా తగ్గిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి గండికొట్టారు. సీహెచ్సీల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారు. విలేజ్, అర్బన్ క్లినిక్లను నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని దారుణంగా దెబ్బతీసి రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ప్రజారోగ్య వ్యవస్థలో మీరు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.
ఇప్పుడు జూనియర్ డాక్టర్ల విషయంలోనూ అహంకారంతో వ్యవహరిస్తూ, మిగిలిన వైద్యసేవలను కూడా పేదలకు దూరం చేస్తున్నారు. చంద్రబాబూ.. ఇప్పటికైనా అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులను వెంటనే చర్చలకు పిలిచి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి. తగిన స్థాయిలో స్టైపెండ్ను పెంచి, సమ్మెను విరమింపజేసి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడండి’ అని సూచించారు.
.@ncbn గారూ… ప్రాణాలు కాపాడే జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి, పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడతారా?
రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా మీరు… pic.twitter.com/g6QjRjj4kA— YS Jagan Mohan Reddy (@ysjagan) August 24, 2026
ఇదీ చదవండి:
వెన్నుపోటు పార్టీపై బీసీ గర్జన!


