కాకినాడ: ఒక్క బిడ్డ బిడ్డా కాదు.. ఓ కన్ను కన్నూ కాదు అంటారు పెద్దలు. సరి ఈడు.. సరిజోడు.. సహాధ్యాయుల సావాసం ఓ వ్యక్తి ఉన్నతికి జిజ్ఞాసకు తోడ్పడుతుంది. పాఠశాల వ్యవస్థ ఏర్పాటుకు ఈ లక్ష్యమే ప్రాణం. ఆ లక్ష్యానికి భిన్నంగా మాట్లాడడానికి, భావ వ్యక్తీకరణకు మరొక జోడు లేకుండా రోజుల తరబడి సాగుతున్న ఆ చిన్నారి ప్రయాణం ఇంకెన్నాళ్లు సాగాలో.. గోగన్నమఠం ప్రాథమిక పాఠశాల నేటి ప్రభుత్వ విద్యా వ్యవస్థ దుస్థితికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఒకప్పుడు పదుల సంఖ్యలో విద్యార్థులు ఆటపాటలతో సందడిగా ఉండే పాఠశాలో నేడు ఒకే ఒక్క విద్యార్థి జి.సుదీర్ మిగిలాడు.
ఆ చిన్నారికి చదువు చెప్పడానికి ఓ హెచ్ఎం.. వండి పెట్టడానికి ఓ ఆయా. ఇదీ ఆ పాఠశాల సంక్షిప్త స్వరూపం. ఇటీవలి వరకూ మరో విద్యార్థి కూడా ఉండేవాడు. అతడు కొన్నాళ్ల కిందట మరో పాఠశాలకు వెళ్లిపోవడంతో సుధీర్ ఒక్కడే మిగిలిపోయాడు. పాఠశాల బెంచ్పై ఒక్కడే కూర్చుండగా హెచ్ఎం తనకు తోచిన నాలుగు ముక్కలు వల్లె వేస్తూ రోజును గడిపేస్తున్నారు.


