తాడేపల్లి : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన బీసీ నేతలు సమావేశమై పలు కీలక అంశాపై చర్చించారు. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులు, బీసీలకు ఎదురవుతున్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ఈ భేటీ అనంతరం చంద్రబాబు సర్కారుపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో బీసీలకు సంక్షేమ పథకాలు అందితే.. నేటి చంద్రబాబు సర్కారులో అన్నింటినీ నిలిపేసి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. బీసీల ఎదుగుదలను అడ్డుకుంటున్న వ్యక్తి చంద్రబాబు. వైఎస్ జగన్ హయాంలో బీసీలకు సంక్షేమ పథకాలు అందించారు. కానీ చంద్రబాబు అన్నిటినీ నిలిపేసి వెన్నుపోటు పొడిచారు. బీసీలకు 34% రిజర్వేషన్ కోసం జగన్ ప్రయత్నిస్తే చంద్రబాబు అడ్డుకున్నారు. తన మనిషితో కోర్టులో కేసు వేయించి అడ్డుకున్నారు. తన పక్కన డిప్యూటీ సీఎం హోదాలో బీసీ కూర్చోకూడదని పదవి ఇవ్వలేదు’ అని విమర్శించారు.
మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘ బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేసే దమ్ముందా?, అమలు కాకుండానే తన ఫోటోలకు పాలాభిషేకం చేయించుకోవడం సిగ్గుచేటు. బీసీలను బ్యాక్ బోన్గా మార్చింది జగనే. మళ్ళీ అందరం ఒక్కతాటి మీదకు వస్తాం. జగన్ను సీఎం చేసుకోవడానికి కృషి చేస్తాం. సీదిరి అప్పలరాజు, విడదల రజిని, రమేష్ యాదవ్, కారుమూరి నాగేశ్వరరావు లాంటి అందరిపై అక్రమ కేసులు పెట్టారు. అధికారం ఉందని జైల్లో పెట్టించారు. చంద్రబాబు కండకావరాన్ని కరిగించే సమయం ఆసన్నమైంది’ అని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ బీసీలకు 34% అనే డ్రామా బిల్లును చంద్రబాబు తెచ్చారు. అది చెల్లదని తెలిసి కూడా చంద్రబాబు బీసీలను మోసం చేస్తున్నారు. ఈ బిల్లు అమలు కాకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా?, జగన్ బీసీలకు డిప్యూటీ సీఎం పదవిస్తే చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు?, బీసీలను చంద్రబాబు పక్కన కూర్చోపెట్టుకోరా?’ అని సూటిగా ప్రశ్నించారు.
మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ‘ బీసీలను అభివృద్ధి చేసింది వైఎస్ జగనే. చంద్రబాబు ఓట్ల కోసం బీసీలకు మోసపూరిత హామీలు ఇచ్చారు అధికారంలోకి రాగానే వెన్నుపోటు పొడిచారు. బీసీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మీసం చేశారు. బీసీలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. బీసీలకు రక్షణ చట్టం తెస్తామని చెప్పి వంచన చేశారు. 34% రిజర్వేషన్ అమలవదని తెలిసీ బీసీలను మరోసారి మోసం చేశారు. వీటన్నటిపై మేము పోరాడతాం’ అని హెచ్చరించారు.


