
సాక్షి, రాజమహేంద్రవరం: విప్లవ నాయకుడు చేగువేరా వారసుడినని చెప్పుకునే పవన్ కళ్యాణ్ తాను నటించిన సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో చెప్పలేడా? అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ పవన్ నటించిన బ్రో సినిమా ఫ్లాప్ అయ్యిందన్నారు.
సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో చెప్పలేనివాడు రాజకీయాల్లో పారదర్శకత ఎలా చూపిస్తాడని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు ఆధ్వర్యాన టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడి చేయడం అమానుషమన్నారు. పోలీసులకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు యాత్ర కొనసాగించి ఉంటే ఎలాంటి ఘటనలు చోటుచేసుకుని ఉండేవి కావన్నారు. కావాలనే చంద్రబాబు ముందు ఇచ్చిన షెడ్యూల్కు విరుద్ధంగా వెళ్లి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని చెప్పారు. పైగా తాను సింహాన్ని అని చంద్రబాబు ప్రకటించుకుంటున్నారని, నక్క.. సింహం ఎలా అవుతుందని అంబటి ప్రశ్నించారు.