
కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సకల సౌకర్యాలు
ఉదయం బ్రేక్ఫాస్ట్.. మధ్యాహ్నం భోజనం.. ఆ తర్వాత నిద్రించడానికి రిక్లైనర్లు
మసాజ్ కుర్చీలు కూడా ఏర్పాటు
సభ్యుల హాజరు శాతం పెంచేందుకేనని స్పీకర్ ఖదీర్ వెల్లడి
ఇవి విలాసాలు కావు.. పని ఒత్తిడిని ఎదుర్కోవడానికంటూ వివరణ
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తుంటాయి. ఆఫీస్కు రాగానే బ్రేక్ఫాస్ట్.. కాస్త బోర్ కొడితే సేదతీరడానికి పలు రకాల ఆటలు.. మధ్యాహ్న భోజనం.. ఆ తర్వాత కునుకు వస్తే నిద్ర పోవడానికి బెడ్లు.. మధ్యమధ్యలో టీ, కాఫీ, జ్యూస్లు.. ఇలా ఎన్నో రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తుంటాయి. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖదీర్ కూడా ఇటువంటి ఆలోచనే చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీలో శాసనసభ్యులకు పలు సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు.
ఉదయం సభకు రాగానే బ్రేక్ఫాస్ట్.. మధ్యాహ్నం భోజనం.. ఆ తర్వాత కునుకు తీసేందుకు రిక్లైనర్ కుర్చీలు.. రిలాక్సేషన్ కోసం మసాజ్ కుర్చీలు ఏర్పాటు చేయించారు. ఈనెల 3 నుంచి మొదలైన కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు 21వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే సమావేశాల సమయంలో చాలా మంది సభ్యులు మధ్యాహ్న భోజనం తర్వాత సభా కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నారని స్పీకర్ ఖదీర్ గుర్తించారు.
ఆ పరిస్థితిని నివారించేందుకు, హాజరుశాతాన్ని పెంచేందుకు గాను.. సభ్యులు మధ్యలో కాసేపు నిద్రపోవడానికి 15 రిక్లైనర్లను, రెండు మసాజ్ కుర్చీలను అద్దెకు తీసుకున్నారు. ఒక్క సమావేశాలప్పుడు తప్ప మిగతా సమయాల్లో వీటి ఉపయోగం ఉండనందున.. ప్రస్తుతం వాటిని కొనుగోలు చేయకుండా అద్దెకు మాత్రమే తీసుకున్నామని స్పీకర్ చెప్పారు. 15 రిక్లైనర్లను, రెండు మసాజ్ కుర్చీలను అధికార, విపక్ష లాంజ్లలో ఏర్పాటు చేశామన్నారు.
మరిన్ని మసాజ్ కుర్చీలకు ప్రతిపాదన..
స్పీకర్ ఖదీర్ మరో అడుగు ముందుకేసి శాసనసభ్యుల కోసం మరిన్ని మసాజ్ కుర్చీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మసాజ్ కుర్చీలతో పాటు సభ్యుల గదులకు స్మార్ట్ లాక్స్ ఏర్పాటు చేయడానికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఖదీర్ తెలిపారు. స్మార్ట్ లాక్స్ ఏర్పాటు వల్ల సభ్యులకు భద్రత పెరగడంతో పాటు వారి గదుల్లోకి ఇతరులెవ్వరూ ప్రవేశించే అవకాశం ఉండదని చెప్పారు. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల ఎమ్మెల్యేలు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని వివరించారు.
వారు చేస్తున్న పనికి ఇవి విలాసాలు కావని.. అవసరాలు మాత్రమేనని చెప్పారు. ఈ సౌకర్యాలకు ఎమ్మెల్యేలు పూర్తిగా అర్హులంటూ తన చర్యలను సమర్థించుకున్నారు. ఈ సదుపాయాల వల్ల సభ్యులు ఇక ఏ కారణంతోనూ బయటకు వెళ్లబోరని అన్నారు. కాగా, స్పీకర్ నిర్ణయాన్ని పలువురు మంత్రులు, అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు సమర్థించగా.. బీజేపీ నేతలు విమర్శించారు.
ఎమ్మెల్యేలు ఒత్తిడితో పని చేస్తారని, పైగా చాలా మంది సీనియర్ సిటిజన్లు ఉన్నందున ఇలాంటి ఏర్పాట్లు మంచివేనని అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే చెప్పారు. పాలనా సమస్యలపై దృష్టి పెట్టకుండా.. ఇలాంటి అనవసరమైన ఖర్చులు చేయడం ఏమిటంటూ బీజేపీ నేత సీటీ రవి విమర్శించారు.