సాక్షి, అమరావతి: పరస్పర అంగీకారంతో భార్య భర్తలు విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు వారికి విడాకులు మంజూరు చేసేందుకు ఆరు నెలల పాటు వేచి ఉండటం (కూలింగ్ పీరియడ్) తప్పనిసరి కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు.
ఇందుకు సంబంధించి ఒంగోలు ఫ్యామిలీ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు.. భార్య, భర్తలు చాలా కాలం నుంచి వేర్వేరుగా ఉంటూ, తమ మధ్య ఉన్న వివాదాలన్నింటినీ పరిష్కరించుకుని పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు విధించే కూలింగ్ పీరియడ్ వల్ల వారికి మానసిక వేదన పెరగడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండబోదని స్పష్టంచేసింది.
ఒంగోలు ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలుచేస్తూ భార్య, భర్తలు దాఖలు చేసిన పిటిషన్ను ఈ మేరకు అనుమతించిన హైకోర్టు వీలైనంత త్వరగా విడాకుల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది.


