
కనెక్షన్ కింగ్లు!
● తారస్థాయికి విద్యుత్ అధికారుల అక్రమాలు ● ఇష్టారాజ్యంగా వసూళ్లు
● డబ్బు దండుకుని అక్రమంగా కనెక్షన్లు ● పైసలివ్వకుంటే అంతులేని జాప్యం
అనంతపురం టౌన్:విద్యుత్ శాఖ అధికారుల చేతివాటం తారస్థాయికి చేరింది. ముడుపులు ముట్టజెబితే తప్ప ముందుకెళ్లని పరిస్థితి నెలకొంది. స్వయంగా ఉన్నతాధికారులే వసూళ్లు చేస్తుండడంతో వారిని ఆదర్శంగా తీసుకుని కింది స్థాయి సిబ్బంది సైతం జేబులు నింపుకుంటున్నారు. అనంతపురం నగర పరిధి రోజు రోజుకూ విస్తరిస్తోంది. పెద్ద పెద్ద భవనాలు, వెంచర్లు, డూప్లెక్స్ ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ఇదే అదునుగా విద్యుత్ శాఖ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ముందు అనుమతుల పేరిట కొర్రీలు విధిస్తూ.. ముడుపులు అందగానే అన్నీ సక్రమంగా ఉన్నాయంటూ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. డీ 2, డీ3 సెక్షన్లలో అపార్ట్మెంట్లను సైతం వదలడం లేదని తెలిసింది. ‘మీరు 4 ఫ్లోర్లకు మాత్రమే అనుమతి తీసుకున్నారు.. ఇక్కడ మాత్రం 5 ఫ్లోర్లు నిర్మించారు.. 5వ ఫ్లోర్కు విద్యుత్ సర్వీసు ఇవ్వం’ అంటూ బెదిరించడం.. డబ్బు అందగానే వాటికి సైతం సర్వీసు మంజూరు చేయడం షరామామూలుగా మారింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆరుకు పైగానే సర్వీసులు మంజూరు చేస్తున్నట్లు తెలిసింది. ఇక.. 100 కిలోవాట్ల విద్యుత్ వాడకం ఉన్న అపార్ట్మెంట్లకు 60, 40 కిలోవాట్లకు మాత్రమే ఎస్టిమేషన్లు వేస్తున్నట్లు సమాచారం.
సంస్థపై పెనుభారం..
విద్యుత్ అధికారుల బాగోతంతో ఎస్పీడీసీఎల్ సంస్థపై అదనపు భారం పడుతోంది. ఇష్టారాజ్యంగా సర్వీసులు ఇస్తుండడంతో లో ఓల్టేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో సమస్యను అధిగమించేందుకు ఎస్పీడీసీఎల్ రూ.కోట్లు ఖర్చు చేస్తూ అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
కళ్యాణదుర్గం రోడ్డు బాలాజీ విల్లాస్ వెనుక భాగంలో నాలుగేళ్ల క్రితం వెలసిన వెంచర్ ఇది. కళ్యాణదుర్గం రోడ్డుకు చెందిన ఓ బిల్డర్ ఇక్కడ కొన్ని ప్లాట్లు కొనుగోలు చేశాడు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు విద్యుత్ సర్వీస్ కోసం డీ–5 సెక్షన్కు వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే విద్యుత్ శాఖ టౌన్ 2లో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. వెంచర్కు అనుమతులు లేవు.. విద్యుత్ సర్వీస్ ఇచ్చేందుకు నిబంధనలు అనుమతించవని చెప్పారు. ఈ క్రమంలో ఉన్నతాధికారికి సదరు బిల్డర్ రూ.2 లక్షలకు పైగా ముడుపులివ్వగా.. వెనువెంటనే సర్వీస్ మంజూరు చేశారు. నారాయణపురంలో సైతం ఇలాగే ఓ వెంచర్ నిర్వాహకుడి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు తెలిసింది. అపార్ట్మెంట్లకు సైతం అనుమతుల నెపంతో ఆయన భారీగా వసూళ్లు చేస్తున్నట్లు విద్యుత్ శాఖలో చర్చ జరుగుతోంది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న షూమార్టును అనంతపురం సుభాష్ రోడ్డులో ఇటీవలే ప్రారంభించారు. భవనానికి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో టౌన్–1లో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 40 కిలోవాట్ల విద్యుత్ వాడకం ఉంటుందని, 63 కిలోవాట్ల సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలని బిల్డింగ్ నిర్వాహకుడికి చెప్పారు. ఈ క్రమంలో నిర్వాహకుడు రూ.5 లక్షలకు పైగా చెల్లించగా.. వెంటనే సిటీమీటర్ను రిలీజ్ చేసి సర్వీస్ మంజూరు చేశారు. విద్యుత్ శాఖ నిబంధనల మేరకు ట్రాన్స్ఫార్మర్ను చార్జ్ చేసిన తర్వాతనే సర్వీస్ మంజూరు చేయాలి. అయితే ముడుపులు అందడంతో అవన్నీ గాలికి వెళ్లిపోయాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇటీవల సుభాష్రోడ్డు, కమలానగర్ ప్రాంతాల్లో లో ఓల్టేజీ సమస్య తలెత్తుతుండటం గమనార్హం.
చర్యలు తీసుకుంటాం
విద్యుత్ సర్వీసుల మంజూరు కోసం వెంచర్ల నిర్వాహకుల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తున్న ఉద్యోగులపై విజిలెన్స్ విచారణ చేపడతాం. వాస్తవమని తేలితే చర్యలు తీసుకుంటాం. ట్రాన్స్ఫార్మర్లు చార్జ్ చేసిన తర్వాతే సిటీ మీటర్లు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం.
– శేషాద్రిశేఖర్, ఎస్ఈ

కనెక్షన్ కింగ్లు!

కనెక్షన్ కింగ్లు!

కనెక్షన్ కింగ్లు!