అన్నదాతలపై చంద్రబాబు చిన్నచూపు
● రైతు దినోత్సవం నిర్వహించని దుస్థితిలో ప్రభుత్వం
అనంతపురం అగ్రికల్చర్: అన్నదాత పట్ల చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వ్యవసాయమన్నా.. రైతన్నా గిట్టదని మరోసారి బయటపడింది. మంగళవారంజాతీయ రైతు దినోత్సవం జిల్లాలో అధికారికంగా నిర్వహించకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ, పట్టు, పాడి, ఉద్యాన, ఏపీఎంఐపీ, మత్స్య మార్కెటింగ్ తదితర శాఖల ఆధ్వర్యంలో కూడా ఎక్కడా గ్రామాలకు వెళ్లి రైతు దినోత్సవం పేరుతో రైతును గౌరవించకపోవడంపై పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ సంస్థ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు దినోత్సవం కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరై సన్మానం అందుకోవడం గమనార్హం.
నాడు వాడవాడలా రైతు దినోత్సవం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్తో వ్యవసాయ రంగానికి ఊపిరిపోసి సంక్షోభంలో ఉన్న రైతును సంక్షేమం దిశగా నడిపించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో కూడా వ్యవసాయ అనుబంధ రంగాలకు, రైతులకు పెద్ద పీట వేసి ప్రోత్సహించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ హయాంలో వైఎస్సార్ జయంతి జూలై 8న ఏకంగా రైతు దినోత్సవంగా వాడవాడలా నిర్వహిస్తూ వచ్చారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఎక్కడా రైతులను పలకరించిన పాపానపోలేదు. యోగాంధ్ర నిర్వహణ, డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్లకు, సూపర్సిక్స్–సూపర్హిట్ అంటూ పెట్టిన సభలు, కార్యక్రమాలకు మంచినీళ్ల ప్రాయంగా ప్రజాధనం ఖర్చు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. రైతు పట్ల మరీ ఇంత చిన్నచూపు చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


