● సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం
● జేఏసీ జిల్లా అధ్యక్షుడు రాంబాబు
పాడేరు: జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డీఎంహెచ్వో డాక్టర్ రియాజ్కు వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు మంగళవారం సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడు గంపరాయి రాంబాబు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ తాము సమ్మె చేయనున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యారోగ్య ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, నగదు రహిత హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, సర్వీస్లో ఉన్న కాంట్రాక్ట్ హెల్త్ ఉద్యోగి మరణిస్తే పూర్తి స్థాయి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఉద్యోగుల రెగ్యులర్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే పలుమార్లు శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేయవలసి వస్తోందన్నారు. సమస్యలు పరిష్కరించే వరకూ దశలవారీగా పోరాటం చేస్తామని చెప్పారు.
ఈనెల 26, 27, 28 తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని, 29, 30 తేదీల్లో ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఆన్లైన్ పనులు నిలుపుదల చేస్తామని, 3, 4 తేదీల్లో ఓపీ సేవలు నిలిపివేస్తామని, 5, 6వ తేదీల్లో ఎమర్జెన్సీ సేవలు బహిష్కరిస్తామని, 7, 8 తేదీల్లో పెన్డౌన్ చేసి ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. 9వ తేదీన కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు చేపడతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమ్మె నోటీసు అందించిన వారిలో వైద్యారోగ్య కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ నేతలు విజయ, వరలక్ష్మి తదితరులు ఉన్నారు.


