తాటిచెట్లపాలెం(విశాఖ): రైల్వే ప్రయాణికుల భద్రత, సురక్షిత ప్రయాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ అధికారులకు సూచించారు. జనరల్ మేనేజర్ కార్యాలయంలో జోన్ పరిధిలోని నాలుగు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రత, భద్రతా చర్యలు, నిఘా వ్యవస్థపై విస్తృతంగా సమీక్షించారు. అనంతరం ఇంజినీరింగ్ పనులు, గూడ్స్ షెడ్ల అభివృద్ధి, పార్సిల్ కార్యాలయాల సదుపాయాల విస్తరణతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పలు రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. విధి నిర్వహణలో అప్రమత్తత, అంకితభావం ప్రదర్శించి పలు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రయాణికుల ప్రాణాలు, రైల్వే ఆస్తులను కాపాడడంలో విశేష సేవలందించిన నలుగురు ఉద్యోగులకు సేఫ్టీ అవార్డులు అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో విజయవాడ డివిజన్కు చెందిన తుని ట్రాక్ మెయింటెనర్ బి. వెంకటరావు, గుంటూరు డివిజన్ గుండ్లకమ్మకు చెందిన స్టేషన్ మాస్టర్ వి. వీరబ్రహ్మం, గుంతకల్ డివిజన్ వెంకటగిరికి చెందిన గేట్మన్ లలిత్ కుమార్, విశాఖ డివిజన్ సింహాచలం నార్త్కు చెందిన గూడ్స్ ట్రైన్ మేనేజర్ జై సింగ్ మీనా ఉన్నారు. వారికి జనరల్ మేనేజర్ అభినందనలు తెలిపారు. సమావేశంలో ఆయా డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు, వివిధ విభాగాల ప్రిన్సిపల్ హెడ్లు పాల్గొన్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జీఎం సందీప్ మాథుర్


