పేద విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం

Aug 23 2026 1:28 AM | Updated on Aug 23 2026 1:28 AM

● నాణ్యమైన విద్య, మెరుగైన వసతుల కల్పనకు కృషి ● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి ‘అడ్లూరి’

ఉట్నూర్‌రూరల్‌:పేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ఉట్నూరు బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం సందర్శించారు. ఐఎఫ్‌ ప్యానెల్‌ను ప్రారంభించారు. విద్యార్థినులకు యూనిఫాం, కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. ఆశ్రమ, గురుకుల పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌, కలెక్టర్‌ రాజర్షిషా, ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ సంతోష్‌, ఎస్‌ఈటీడబ్ల్యూ ఫణికుమారి, అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, ఆర్డీవో మోహన్‌సింగ్‌, డి.ప్రేమకళ, డీటీడీవోలు అంబాజీ, నిహారిక, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి, సర్పంచ్‌ అనిత జాదవ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జు ఫొటోను తొలుత బ్యానర్‌లో చేర్చలేదు. ప్రొటోకాల్‌ లోపాన్ని గమనించిన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమావేశం జరుగుతుండగానే పాత ఫ్లెక్సీని తొలగించి ఎమ్మెల్యే ఫొటోతో కూడిన కొత్త ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం గమనార్హం.

దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ

మహిళా శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేబీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులకు రూ.30.68 లక్షల విలువగల 26 ఉపకరణాలను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ నగేశ్‌, ఎమ్మెల్యే బొజ్జు, ఎమ్మెల్సీ విఠల్‌, కలెక్టర్‌ రాజర్షి షా, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమంతో పాటు విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అడ్లూరి అన్నారు. కేబీ కాంప్లెక్స్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సంక్షేమ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఐటీడీఏ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో పెండింగ్‌ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పారదర్శకంగా, నిర్దేశిత లక్ష్యాల మేరకు వినియోగించాలని సూచించారు. ఎమ్మెల్సీ విఠల్‌ మాట్లాడుతూ, అటవీ శాఖ అనుమతుల కారణంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు త్వరితగతిన క్లియరెన్స్‌ వచ్చేలా ఆయా శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. కలెక్టర్‌ రాజర్షి షా మాట్లాడుతూ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలోని 569 విద్యాసంస్థల్లో సుమారు 54వేల మంది చదువుతున్నారని తెలిపారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫాం, కిట్ల పంపిణీని ప్రారంభించినట్లు చెప్పారు. పీవో మకరందు మాట్లాడుతూ, ఐటీడీఏ పరిధిలో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ, గిరిజన సంక్షేమం, విద్యా సంస్థలు, మౌలిక వసతులపై గవర్నింగ్‌ బాడీ సమావేశం నిర్వహించి సమగ్ర నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ సూచించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. రోడ్లు, వంతెనల పనులకు సంబంధించిన టెండర్లు, అగ్రిమెంట్లను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని, అటవీ అనుమతుల జాప్యాన్ని నివారించాలని కోరారు. అంతకుముందు కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహక నగదు చెక్కులను మంత్రి అందజేశారు. సమావేశంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ సంతోష్‌, గురుకులాల కార్యదర్శి సీతామహాలక్ష్మి, నాలుగు జిల్లాల ఉన్నతాధికారులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement