కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రచారం
పొలిటికల్, సోషల్ మీడియాలో జోరుగా చర్చ
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించవచ్చని రాష్ట్ర రాజకీయాల్లో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఆదివాసీ గిరిజన వర్గానికి చెందిన నగేశ్కు సామాజిక సమతుల్యత దృష్ట్యా కేంద్ర కేబినేట్లో చోటు కల్పించే అంశాన్ని పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం నగేశ్కు ఉంది. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు, ఉత్తర తెలంగాణ గిరిజన ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఈ నిర్ణయం ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నేపథ్యమిది..
నగేశ్ బోథ్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వంలో గిరిజన, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 లోక్సభ ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి మొదటిసారి ఎంపీగా గెలుపొందారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఓటమిచెందారు. 2024లో ఆయన బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. అప్పుడే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కమలం పార్టీ నుంచి బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. బజార్హత్నూర్ మండలం జాతర్ల గ్రామానికి చెందిన ఈయన గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయల్లోకి వచ్చి వివిధ పదవులను చేపట్టారు.
సామాజిక సమీకరణాల దృష్ట్యా మంత్రి పదవి దక్కవచ్చని..


