
జిల్లాకు యూనివర్సిటీ తీసుకొచ్చేందుకు కృషి
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్టౌన్: రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల పరిధిలో తొమ్మిది జిల్లాలకు యూనివర్సిటీలు ఉండగా ఆదిలాబాద్కు మాత్రమే లేదని, జిల్లాకు యూనివర్సిటీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హామీ ఇచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని సైన్స్ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చదువుకునే సమయంలో డిగ్రీ కళాశాలలో ఎన్నికలను చూసిన తర్వాతే నాయకుడిని కావాలన్న ఆలోచన వచ్చిందన్నారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సంగీత, వైస్ ప్రిన్సిపాల్ జగ్రాం, అకాడమిక్ కోఆర్డినేటర్ సంతోష్ కుమార్, లెక్చరర్లు శ్రావణి, జ్యోత్స్న, రమాకాంత్ గౌడ్, చక్రవర్తి, మంజూల, అష్రఫ్ అలీ, రాజ్కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.