
ఈదురు గాలుల బీభత్సం
● పలు ఇళ్లపై ఎగిరిపోయిన పైకప్పులు ● నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, వృక్షాలు
ఆదిలాబాద్టౌన్(జైనథ్): అకాల వర్షం అతలాకుతలం చేసింది. జైనథ్ మండలంలో బుధవారం రాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. ఈదురు గాలులకు జైనథ్ మండలంలోని సిర్సన్న గ్రామంలో దాదాపు పది ఇళ్ల పైకప్పులు లేచి ఎగిరిపడ్డాయి. పూరి గుడిసెలు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు దెబ్బతిన్నాయి. మండలంలోని భోరజ్, సిర్సన్న, గూడ గ్రామాల్లో జొన్న పంట నేలకొరిగింది. మామిడి కాయలు రాలిపోయాయి. చేతికొచ్చిన పంట నేలకొరగడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. సిర్సన్నలోని కుర్మ తిరుపతి, లసుందేవి, పెద్ద ఆశన్న, ఆశన్న, అశోక్, తదితరుల ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపడ్డాయి. పలు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.