
సాక్షి, ఆదిలాబాద్: ‘కరెంట్ కావాల్నా.. కాంగ్రెస్ కావాల్నా.., రైతుబంధు కావాల్నా.. రాబందా?..’ అంటూ సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభల్లో సభికులను ప్రశ్నించారు. దీంతో కరెంట్ కావాలని... రైతుబంధు ఉండాలని జనం ఉత్సాహంగా బదులిచ్చారు. సంక్షేమ పథకాలుండాలంటే ఆదిలాబాద్, బోథ్ బీఆర్ఎస్ అభ్యర్థులు జోగు రామన్న, అనిల్జాదవ్ను గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. వీరిని గెలిపిస్తేనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, తద్వారా అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు.
కాంగ్రెస్ను గెలిపిస్తే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ రాదని, రైతుబంధు రద్దు చేస్తారని విమర్శించారు. గురువారం ఆదిలాబాద్, ఇచ్చోడలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలకు ఆయన హాజరై ప్రసంగించారు. ఆదిలాబాద్ చరిత్రలో ఒకే ఒక్కడు జోగు రామన్న తన మాట నిలబెట్టుకుని కోరటా–చనాకా బ్యారేజీ చేయిస్తున్నాడని, పనులు పూర్తి కావచ్చాయని తెలిపారు. అలాగే బోథ్ నియోజకవర్గ అభ్యర్థి అనిల్జాదవ్ విజ్ఞప్తి మేరకు కుప్టి రిజర్వాయర్ ప్రారంభించి పూర్తి చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
అనిల్జాదవ్ను గెలిపిస్తే బోథ్ రెవెన్యూ డివిజన్ను నెలరోజుల్లోనే ఏర్పాటు చేస్తానని చెప్పా రు. డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని తెలిపారు. ఇక్కడ టమాట సాగు చేస్తున్నందున కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కోరటా–చనాకా కాలువతో 51వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. దీనిని పిప్పల్కోటి రిజర్వాయర్కు కూడా లింక్ చేసుకుంటే బ్రహ్మాండమైన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. జోగు రామన్న, అనిల్జాదవ్ సామాన్య, ఉత్తమ వ్యక్తులని, ప్రజల్లో కలిసి ఉండేవారని కితాబిచ్చారు.
ఉత్సాహం నింపిన సభలు!
జిల్లాలో సీఎం కేసీఆర్ సభలు సక్సెస్ కాగా గులాబీ శ్రేణుల్లో ఆనందోత్సాహం కనిపిస్తోంది. ఆదిలాబా ద్, ఇచ్చోడలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలకు భారీగా జనసమీకరణ చేశారు. ఆదిలాబాద్ డై ట్ మైదానం, ఇచ్చోడలోని బైపాస్ రోడ్డు వద్ద మైదా నంలో గురువారం భారీ సభలు నిర్వహించారు. మొదట ఆదిలాబాద్కు మధ్యాహ్నం 2.15గంటలకు కేసీఆర్ హెలీక్యాప్టర్లో చేరుకున్నారు. సీఎం రాక ఆలస్యమైనా జనాలు ఉత్సాహంగా ఎదురుచూడటం కనిపించింది. తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేణుగోపాలాచారి, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆయన వెంట వచ్చారు.
ఎమ్మెల్సీ దండే విఠల్, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, మున్సి పల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఇచ్చోడ సభకు సీఎం చేరుకున్నారు. ఆదిలాబాద్ సభలో పాల్గొన్న నేతలతోపాటు మాజీ ఎంపీ గోడం నగేశ్, ఇచ్చోడ, బోథ్ ఎంపీపీలు ప్రీతంరెడ్డి, తుల శ్రీనివాస్, తాంసి జెడ్పీటీసీ సభ్యుడు రాజు, మండల కన్వీనర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి..
జిల్లాలో అధికశాతం రైతులు పత్తి సాగు చేస్తున్నారు. ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే వారికి మేలు జరగనుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేశారు. బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటు చేశారు. ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలిచ్చారు. మిగతా అందరికీ త్వరలో అందజేస్తారు. జిల్లాలో ఫార్మసీ, పీజీ కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇదివరకు జిల్లాకు అనేక నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో నడిపించిన సీఎంకు కృతజ్ఞతలు. – జోగు రామన్న, ఆదిలాబాద్ అభ్యర్థి
జనం బీఆర్ఎస్ వెంటే..
బోథ్ నియోజకవర్గ జనం ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. బోథ్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి. డిగ్రీ కళాశాల, కుప్టి ప్రాజెక్ట్ కోసం టెండర్లు వేయాలి. ఇచ్చోడ, బోథ్ మండలాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలి. చిక్మన్ ప్రాజెక్ట్ రీడిజైన్ చేయాలి. ఇచ్చోడలో పోలీస్ సబ్డివిజన్ ఏర్పాటు చేయాలి. – అనిల్జాదవ్, బోథ్ అభ్యర్థి
ఇవి చదవండి: తప్పుల తడక.. ఎప్పటికీ మారదిక!